

జైపూర్: ఐపీఎల్ 2019 క్రికెటర్ల వేలంలో సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. వేలంలో భాగంగా రెండోసారి యువరాజ్ సింగ్ను ముంబై ఇండియన్స్ కనీసధర రూ.కోటికి సొంతం చేసుకుంది.
వేలంలో భాగంగా తొలి రౌండ్లో యువీకి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కోసం వేలంలో ప్రాంఛైజీలు తనను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో యువరాజ్ సింగ్ ధరను సైతం తగ్గించుకున్నప్పటికీ తొలి రౌండ్లో ఫ్రాంచైజీలు మొండి చేయి చూపించాయి.
జైపూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలంలో 13దేశాలకు చెందిన ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. ఈసారి వేలం ప్రక్రియను హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచకప్ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్కు తొలి రౌండ్లో చుక్కెదురైంది.
దీంతో.. తొలి విడత అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఈ ఆల్రౌండర్ చేరిపోయాడు. గతేడాది అతడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడాడు. ఆశించిన మేరకు రాణించకపోవడంతో విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్న యువీ తన కనీస ధరను రూ.2 కోట్ల నుంచి కోటికి తగ్గించుకున్నాడు. 2015 ఐపీఎల్ వేలంలో రూ. 16 కోట్లకి అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్.. గత మూడు సీజన్లలోనూ అంచనాల్ని అందుకోలేకపోయాడు.
గతేడాది రూ.2 కోట్లకి కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ.. అతడి పేలవ ప్రదర్శన కారణంగా మళ్లీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో.. తన ధరని యువీ అనూహ్యంగా రూ. కోటికి తగ్గించుకున్నా ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లను భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ఆల్రౌండర్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. గత ఏడాదిన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉంటున్న యువీ.. దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నా.. ఫామ్ అందుకోలేకపోతున్నాడు.