న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచంలో సెల్ఫీ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సెల్ఫీ మానియా నుంచి తప్పించుకోలేకపోయారు. ఇటీవల కాలంలో చాలా దేశాలు చుట్టేసిన ప్రధాని మోడీ.. ఆయా దేశాధి నేతలతో, అభిమానులతో సెల్ఫీలు తీసుకున్నారు.
అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కొత్తగా పరిచయమైన కొత్త యాప్ వెల్ఫీలోకి ప్రవేశించాల్సి ఉంది. వెల్ఫీ అంటే వీడియో సెల్ఫీ అన్నమాట. మనం చెప్పే మాటలు, పాటలు కూడా ఈ వెల్ఫీ ద్వారా తెలియజేయొచ్చు.

కాగా, క్రికెటర్ యువరాజ్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వెల్ఫీ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోడీ, దేశ మహిళలను ఉద్దేశించి చేసిన ముఖ్యమైన వ్యాఖ్యలను యువరాజ్ సింగ్ వెల్ఫీలో ప్రస్తావించారు. కాగా, యువరాజ్ వెల్ఫీ ఇప్పటికే 980 సార్లు రీట్వీట్ చేయపడగా, ట్విట్టర్లో 1,815 ఫేవరైట్లు వచ్చాయి. ఫేస్బుక్లో అయితే 31,000 లైక్స్ రాగా, 530 మంది షేర్ చేశారు.
కాగా, యువీ వెల్ఫీకి ప్రధాని మోడీ స్పందించి, అభినందనలు తెలియజేశారు. 'యువరాజ్ సింగ్ మైదానంలోనూ, మైదానం వెలుపలా ప్రతిభ గల వ్యక్తి' అని ప్రశంసించారు.