ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లకు పరస్పర విరుద్ధ ప్రయోజన (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) సెగ నుండి ఇంకా విముక్తి లభించడం లేదు. తాజాగా భారత దిగ్గజం కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్లు విరుద్ధ ప్రయోజన అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ ఆదేశించారు. విరుద్ధ ప్రయోజనాలపై వివరణ కోసం ఈనెల 27, 28 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించారు.
న్యూజిలాండ్తో పురుషులు.. నెదర్లాండ్స్తో మహిళలు!!
గతంలో కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులుగా కొనసాగారు. కపిల్, గైక్వాడ్ ఇద్దరూ విరుద్ధ నిబంధనల కింద ఒకేసారి వేర్వేరు పదవుల్లో ఉన్నారని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జైన్.. సెప్టెంబర్లో వారికి నోటీసులు జారీ చేయడంతో కమిటీకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం సీఏసీ లేకున్నప్పటికీ డిసెంబర్ 27, 28న కపిల్, గైక్వాడ్ వివరణ ఇవ్వాల్సిందిగా జైన్ కోరారు. బీసీసీఐ ఉద్యోగి మయాంక్ పారిఖ్కు కూడా విరుద్ధ ప్రయోజనాల విషయంలో నోటీసులు అందాయి. డిసెంబర్ 27న జైన్ ముందు హాజరు కావాల్సి ఉంది. భారత క్రికెటర్స్ అసోసియేషన్ డైరెక్టర్గా ఉన్న కపిల్.. సీఏసీ సభ్యుడిగా భిన్న పాత్రలు పోషించారు. ఇక గైక్వాడ్కు సొంత అకాడమీ ఉంది. భారత మహిళలు, పురుషుల జట్ల కోచ్ల ఎంపిక కోసం కపిల్ నేతృత్వంలో సీఏసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
'సీఏసీకి కపిల్, గైక్వాడ్ రాజీనామా చేసినప్పటికీ ఎథిక్స్ అధికారి వారి నుంచి స్పష్టత కోరుతున్నారు' అని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 'ఎథిక్స్ అధికారిని తప్పకుండా కలుస్తాను. గతంలో నా అభిప్రాయాన్నిలేఖ ద్వారా వివరించా. ఇప్పుడు కూడా వివరిస్తాను. విరుద్ధ ప్రయోజనాలు లేవని సంతృప్తి చెందాకే క్రికెట్ పాలకుల సంఘం మా నియామకాన్ని ఆమోదించింది' అని గైక్వాడ్ స్పదించారు..