
సన్రైజర్స్ హైదరాబాద్
మినీ వేలాన్ని చక్కగా ఉపయోగించుకున్న జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. అందరి కన్నా ఎక్కువగా రూ.42 కోట్లపైగా పర్సు వాల్యూతో వేలానికి వచ్చిన ఆ జట్టు ఆచితూచి ఖర్చు చేసింది. ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది.
టీమిండియా వెటరన్ మయాంక్ అగర్వాల్ను రూ.8 కోట్లకు చేజిక్కించుకుంది. తద్వారా టాపార్డర్లో కేన్ విలియమ్సన్ స్థానాన్ని ఎగ్రెసివ్ ఇండియన్ ప్లేయర్తో భర్తీ చేసింది. బ్రూక్, హెన్రీక్ క్లాసెన్ వల్ల బ్యాటింగ్ మరింత బలంగా మారగా.. అదిల్ రషీద్ చేరికతో స్పిన్ బౌలర్ సమస్య కూడా తీరింది. అందుకే ఈ వేలం చూసిన అందరూ సన్రైజర్స్ స్ట్రాటజీని చాలా మెచ్చుకుంటున్నారు.

గుజరాత్ టైటాన్స్
డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ కూడా ఈ వేలాన్ని చక్కగా ఉపయోగించుకుంది. తమ జట్టును మరింత శక్తిమంతంగా తయారు చేసుకుంది. సన్రైజర్స్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ పొరపడిందేమో అని చాలా మంది అనుమానించారు. ముఖ్యంగా ప్రస్తుతం విలియమ్సన్ ఫామ్లో లేకపోవడంతో ఈ ప్రశ్న తలెత్తింది.
అయితే గుజరాత్ జట్టు బ్యాటింగ్కు విలియమ్సన్ వంటి ఆటగాడు చాలా అవసరం. అలాగే టీ20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ను కూడా గుజరాత్ కొనుగోలు చేసింది. దేశవాళీ స్టార్ శివమ్ మావిని ఏకంగా రూ.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తద్వారా ఈ జట్టు తమ ట్రోఫీని కాపాడుకోవడానికి గట్టిగానే సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్
గతేడాది ఐపీఎల్లో దాదాపు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు రాజస్థాన్ రాయల్స్. అయితే ఫైనల్లో గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. ఆ జట్టులో చెప్పడానికి పెద్దగా లోపాలేం లేవు కానీ.. బ్యాటింగ్ డెప్త్ అంతగా ఉన్నట్లు కనిపించ లేదు. ఈ వేలంలో ఆ సమస్యను తీర్చుకోవడానికి రాజస్థాన్ చాలా చక్కటి స్ట్రాటజీతోనే ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతను చక్కగా బౌలింగ్ చేయడమే కాదు, ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు. అలాగే ఆడమ్ జంపా, జో రూట్ను కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో ఆడే ప్రతి ఆటగాడికీ మరో క్వాలిటీ రిప్లేస్మెంట్ ఆ ఫ్రాంచైజీ దగ్గర ఉంది. ఈసారి కూడా ట్రోఫీ కోసం రాజస్థాన్ గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












