భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కూడా సారథులుగా టీమిండియాకు గొప్పగానే బాధ్యతలు నిర్వర్తించారని, కానీ ధోనీనే అత్యుత్తమ కెప్టెన్ అని యూనివర్సల్ బాస్ గేల్ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన గేల్ ఆసక్తికర సమాధానలు చెప్పాడు.
అత్యంత సవాలైన బౌలర్ గురించి గేల్ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెంటార్గా బాధ్యతలు నిర్వర్తించడం ఆసక్తిగా ఉందని తెలిపాడు. ఐపీఎల్లో తనకు అపారమైన అనుభవం ఉందని, అది యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని గేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో క్రిస్ గేల్ 142 మ్యాచ్లు ఆడాడు. 39.72 సగటు, 148.96 సగటుతో 4965 పరుగులు చేశాడు.

''భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా కెప్టెన్లుగా బాగానే పనిచేశారు. కానీ ధోనీ ఓవరాల్గా ట్రెండ్ సెట్ చేశాడు. ఇక అత్యంత సవాలైన బౌలర్ గురించి చెప్పాలంటే.. అతను ఇంకా పుట్టాడా? లేదా బతికే ఉన్నాడా? అని నాకు తెలియదు. నా దృష్టిలో ప్రతి బౌలర్ సవాలే. వికెట్ తీయడానికి ప్రయత్నిస్తుంటారు''
''ప్రతి బౌలర్ ఓ మంచి బంతితో టాప్లోకి వెళ్లొచ్చు. అయితే అదే సమయంలో టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లను ఎదుర్కోవడం సరదాగా ఉంటుంది. ప్రతి బౌలర్ మంచి సవాలైనవాళ్లే. కానీ ఈ యూనివర్సల్ బాస్ వాళ్ల కంటే మరింత సవాలైనవాడు. ఇక ఐపీఎల్లో పాల్గొనడం ఎంతో బాగుంటుంది. నా దగ్గర అపారమైన అనుభవం ఉంది. అంతేగాక ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాను. నా అనుభవాన్ని పంచుకోవటాన్ని నేను ఆస్వాదిస్తాను'' అని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.
ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడి క్రిస్ గేల్ పేరిట రికార్డు ఇప్పటికీ కొనసాగుతోంది. 2013లో పుణె వారియర్స్పై క్రిస్ గేల్ 175 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. లీగ్లో ఓవరాల్గా 357 సిక్సర్లు బాదాడు.