Abhishek Sharma: భారత జట్టు యువ సంచలనం, ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ కష్టకాలంలో దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ అందించిన అద్భుతమైన మద్దతు గురించి తాజాగా వెల్లడించారు. తాను జట్టులో స్థానం సంపాదించడానికి, తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడానికి యువీ ఎలా సహాయపడ్డారో వివరించారు.
యువీ సలహా.. కష్టాల నుంచి గట్టెక్కించింది..
'బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్ శర్మ, ఐపీఎల్లో అవకాశాలు దక్కక, ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దొరకక ఇబ్బంది పడుతున్న సమయంలో యువరాజ్ సింగ్ను సహాయం కోరానని తెలిపారు. "నేను నిజంగా చాలా కృతజ్ఞుడను. లాక్డౌన్ సమయంలో శుభ్మన్ గిల్, శుభ్మన్ గిల్, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్మోల్ప్రీత్, నేను యువీ అన్న ఇంటి వద్దే క్యాంప్ వేసి సాధన చేసేవాళ్లం. ఆ సమయంలో నాకు ఆ శిక్షణ చాలా అవసరం. ఒకసారి మేము విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని రోజుల పాటు నేను మీతో కలిసి ప్రాక్టీస్ చేయవచ్చా? అని అడిగాను. అందుకు యువీ అంగీకరించారు. నిజం చెప్పాలంటే, నేను ఆ సమయంలో చాలా కష్టపడుతున్నాను" అని అభిషేక్ నాటి రోజులను గుర్తుచేసుకున్నాడు.

అభిషేక్కు లక్ష్యాన్ని స్పష్టం చేసిన యువీ మాట
యువరాజ్ సింగ్తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, ఆయన మాట్లాడిన మాటలే తన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయని అభిషేక్ శర్మ వివరించారు."ఒక రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత యువీ నాతో నేరుగా ఇలా అన్నారు. నేను నిన్ను ఐపీఎల్ కోసమో, డొమెస్టిక్ క్రికెట్ కోసమో సిద్ధం చేయడం లేదు. భారత జట్టులోకి వచ్చేందుకు కూడా నేను శిక్షణ ఇవ్వడం లేదు. నేను నిన్ను భారత్కు మ్యాచ్లు గెలిపించే ఆటగాడిగా తయారు చేస్తున్నాను. ఈ మాటను నువ్వు రాసి పెట్టుకో. ఇది రెండు లేదా మూడు సంవత్సరాలలో జరుగుతుంది' అని యువీ చెప్పారు."యువరాజ్ సింగ్ చెప్పిన ఈ మాటలతోనే అభిషేక్ తన లక్ష్యం ఎంత పెద్దదో, దానిని చేరుకోవడానికి ఎంత కష్టపడాలనే స్పష్టత తనకు లభించిందని తెలిపారు.
ఒకే ఏడాదిలో నంబర్ 1 స్థానం
25 ఏళ్ల అభిషేక్ శర్మ 2024లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి, 196.07 స్ట్రైక్ రేట్తో 849 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. కేవలం ఒక్క సంవత్సరంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో సాధించి, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. ఆసియా కప్ 2025లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' కూడా అతనే కావడం గమనార్హం.