టీ20 వరల్డ్ కప్లో సునాయాసంగా సూపర్-8కు చేరుకున్న భారత్ ఇవాళ అఫ్గానిస్థాన్తో తలపడనుంది. బార్డబోస్ వేదికగా జరిగే ఈ పోరులో గెలిచి రెండో దశను ఘనంగా ఆరంభించాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతుంది. అయితే తుదిజట్టు మార్పులు, బార్డబోస్ వికెట్ పరిస్థితుల గురించి భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. యూఎస్ఏలో స్లో పిచ్లపై వచ్చిన విమర్శల గురించి కూడా ద్రవిడ్ స్పందించాడు.
''పరిస్థితులకు తగ్గట్లుగా మారే ఆటనే క్రికెట్. మన నైపుణ్యాలు, ప్రదర్శనపై పిచ్ తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. క్రీడల్లో క్రికెట్కు ఇది ఓ ప్రత్యేకం. మ్యాచ్పై పిచ్ ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. అమెరికాలోని న్యూయార్క్లో ఈ పరిస్థితిని మనం చూశాం. హైదరాబాద్లోని వికెట్లా అన్నీ ఉండవు కదా! అలాగే అన్నీ పిచ్ ఒకే తరహాలో ఎందుకు ఉంటాయి? పిచ్లు ఇలా భిన్నంగా ఉండటం మనం గర్వించదగ్గ విషయమే. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని ద్రవిడ్ అన్నాడు.

ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియంలో రికార్డు స్కోర్లు నమోదైన విషయం తెలిసిందే. ఉప్పల్ ఫ్లాట్ వికెట్పై ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి భారీ స్కోర్లు సాధించారు. మరోవైపు న్యూయార్క్లోని నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలోని పిచ్లు స్లోగా ఉన్నాయి. ఈ మందకొడి పిచ్లపై బ్యాటర్లు బంతికో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. 120+ అయితే భారీ స్కోరు అనేలా పరిస్థితి మారిపోయింది.
కాగా, టీ20 వరల్డ్ కప్లో భారత్ అన్ని మ్యాచ్లు స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30 నుంచే ఆడుతోంది. భారత అభిమానులు రాత్రి వేళలో ఇక్కడ మ్యాచ్ను వీక్షించడానికి మ్యాచ్లను అలా నిర్వహిస్తున్నారు. దీనిపై రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. సూర్యుని వెలుతురులో ఆడటం వల్ల తమ జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ.. భారత ఓపెనర్లగా రోహిత్-కోహ్లి మినహా మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితిని బట్టి మారుతుందని తెలిపాడు. ఐపీఎల్లో ఓపెనర్గా సత్తాచాటిన కోహ్లి ప్రపంచకప్లో 1, 4, 0తో నిరాశపరిచిన విషయం తెలిసిందే.