
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు, టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించలేని ఘనతల్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించేశాడని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా భారత జట్టు లక్ష్య ఛేదనలో విరాట్ సాధించిన సెంచరీలే అతని అసాధారణ ప్రదర్శనకు నిదర్శనమని కొనియాడాడు.
ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ మెంటార్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో ఎవరు అత్యుత్తమ క్రికెటర్..? అనే ప్రశ్నకు సమాధానంగా కోహ్లినే బెస్ట్ అంటూ సూటిగా బదులిచ్చాడు షేన్ వార్న్.
'కోహ్లి అత్యుత్తమంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా జట్టు ఛేజింగ్కి దిగిన సమయంలో అతను నమోదు చేసిన సెంచరీలు అసాధారణం. క్రికెట్లో సచిన్తో సహా ఎవరికీ సాధ్యంకాని రీతిలో విరాట్ కోహ్లి రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. వరల్డ్ క్రికెట్లో కోహ్లినే బెస్ట్. సచిన్ రికార్డులు కంటే కోహ్లి రికార్డులే అత్యుత్తమం. మా తరంలో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా అత్యుత్తమ క్రికెటర్లు.. ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్ ఆ స్థాయి ఆటగాళ్లు. వీరిద్దరి మధ్య పోలిక తేవడం చాలా కష్టం. ఆటపై విరాట్ కోహ్లి అంకితభావం నాకు బాగా నచ్చుతుంది' అని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు.
వన్డే ఫార్మాట్లో టీమిండియా ఛేదనకు దిగిన సమయంలో విరాట్ కోహ్లి ఇప్పటికే 19 శతకాలు బాదగా.. సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలే చేశాడు. వన్డే కెరీర్లో సచిన్ మొత్తం 51 సెంచరీలు నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా, కోహ్లి 35 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.