మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో మెగా ఆక్షన్ నిబంధనలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. రిటైన్డ్ ప్లేయర్ల పరిమితి, రైట్ టూ మ్యాచ్ కార్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్లు, విదేశీ ప్లేయర్లపై ఆక్షన్ రూల్స్ ఎలా మారతాయని ఆసక్తి నెలకొంది. మరోవైపు స్టార్ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీలను వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ వంటి స్టార్లు ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ రోహిత్ మెగా ఆక్షన్లోకి వస్తే అందరి కంటే అధిక మొత్తాన్ని అందుకుంటాడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్, పంజాబ్ కింగ్స్ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. కెప్టెన్సీతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడే సత్తా ఉన్న హిట్మ్యాన్పై కనక వర్షం కురుస్తుందని చెప్పాడు.

''ఫ్రాంచైజీ పాకెట్లో ఉన్న డబ్బులపై వేలం ఆధారపడి ఉంటుంది. అయితే వేలంలోకి రోహిత్ శర్మ వస్తే.. అతనే అత్యధిక పలుకుతాడని భావిస్తున్నా'' అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ రోహిత్ అయిదు టైటిళ్లు అందించాడు. అయితే ఈ సీజన్లో ముంబై ఫ్రాంచైజీ రోహిత్కు బదులుగా హార్దిక్కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంపై హిట్ మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడని, మెగా వేలానికి ముందు ముంబైను వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి.
మెగా వేలానికి రోహిత్ శర్మ వస్తే ఐపీఎల్ వేలం రికార్డులు బద్దలవుతాయని సంజయ్ బంగర్తో సహా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అతన్ని రూ. 24.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇదే వేలంలో ప్యాట్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు తీసుకుంది.