
హైదరాబాద్: భారత్లో ప్రస్తుతం పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో నిర్వహించే అన్ని టోర్నీలను ఐసీసీ రద్దు చేయాలని... ఇతర జట్లను కూడా అక్కడ పర్యటించకుండా నిషేధం విధించాలని మియాందాద్ కోరాడు.
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన అనంతరం పాకిస్థాన్లో పర్యటించడానికి ప్రపంచంలోని మిగతా క్రికెట్ దేశాలు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే, దశాబ్దం తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్ను పాకిస్థాన్ 1-0తో కైవసం చేసుకుంది.
తాజాగా పాక్ ప్యాషన్.కామ్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో జావేద్ మియాందాద్ మాట్లాడుతూ "భారత్లో ఏం జరుగుతుందో ప్రజలంతా తెలుసుకోవాలి. అక్కడ నిర్వహించే అన్ని టోర్నీలను ఐసీసీ నిషేధించాలి. భారతదేశం ఏ పర్యాటకుడికి లేదా ఎవరికైనా సురక్షితమైన దేశం కాదు. క్రీడాకారులుగా దీనిని మనం ఖండించాలి" అని అన్నాడు.
"అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పాకిస్థాన్ తరఫున నేను మాట్లాడుతున్నా. భారత్తో అన్ని క్రీడా సంబంధాలు రద్దు చేసుకోవాలి. ఇతర దేశాలు సైతం ఇలాగే చేయాలి" అని జావేద్ మియాందాద్ అన్నాడు. భారత్ను లక్ష్యంగా చేసుకుని మియాందాద్ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు.
అతడికంటే ముందు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్సన్ మణి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. కరాచీ టెస్టులో శ్రీలంకపై పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం ఎహ్సన్ మణి భారత్లో భద్రత కరవైందని వెల్లడించాడు. స్వదేశం వదిలి ఎక్కువగా లండన్లో ఉండే నీలాంటి వ్యక్తి భారత భద్రత విషయాలపై మాట్లాడటం తగదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కౌంటర్ ఇచ్చారు.