
ముంబై: భారత్లో కరోనా సెకండ్ వేవ్ చూసి టీమిండియా మాజీ బ్యాట్స్మన్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో జీవితాలు పణంగా ఉన్నాయని, జీవితంలో ఎప్పుడూ ఇంత నిస్సహాయంగా లేను అని రైనా పేర్కొన్నాడు. వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. లీగ్ వాయిదా పడినా ఆటగాళ్ల కరోనా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఒకరి నుంచి మరొకరి వైరస్ సోకుతుందేమోనని భయపడుతున్నారు.
ఇక మంగళవారం ఐపీఎల్ 2021 వాయిదా పడిన తర్వాత సురేష్ రైనా ఓ ట్వీట్ చేశాడు. 'ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. ఎన్నో జీవితాలు పణంగా ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ ఇంత నిస్సహాయంగా లేను. మనం ఎంత సాయం చేద్దామని అనుకున్నా సరే. మన దగ్గర ఉన్న వనరులు అయిపోతున్నాయి. ప్రాణాలను కాపాడటానికి ఒకరికొకరు చేయూతగా నిలుస్తున్న దేశంలోని ప్రతి పౌరుడికి సెల్యూట్' అని రైనా భావోద్వేగం చెందాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
ఐపీఎల్ 2021లో సురేశ్ రైనా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్ ఆడిన నాలుగో క్రికెటర్గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. అంతేకాదు 200 మ్యాచ్ ఆడిన రెండో సీఎస్కే ఆటగాడిగా కూడా నిలిచాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ఐపీఎల్ టోర్నీలో 200 మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే. ఓవరాల్గా ఐపీఎల్ టోర్నీలో 200వ మ్యాచ్లు ఆడిన నాలుగో ప్లేయర్గా రైనా గుర్తింపు పొందాడు.
ఇటీవలే ఐపీఎల్లో సురేష్ రైనా మరో ఘనతను కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన 7వ క్రికెటర్గా నిలిచాడు. మార్చి 19న ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రైనా రెండు సిక్స్లు కొట్టడం ద్వారా 200 సిక్సర్ల మార్కును చేరాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రైనా ఆ రెండు సిక్స్లను కొట్టాడు. టోర్నీలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్పై ఉంది. గేల్ 356 సిక్సర్లతో టాప్లో ఉన్నాడు.