
సిడ్నీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి షాకుల మీద షాకులు తగిలిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముందుగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోగా.. ఆపై ఇంగ్లండ్ టీమ్ కూడా (పురుషులు, మహిళలు) పాక్ టూర్ను రద్దు చేసుకుంది. దీంతో పీసీబీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఉన్నపళంగా రెండు పెద్ద క్రికెట్ దేశాలు తమ పర్యటనను రద్దుచేసుకోవడంతో ఏం చేయని స్థితిలో పడింది. ఈ విషయంపై పాకిస్తాన్ బోర్డు సహా ఆ దేశ మాజీలు, ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. తాజాగా పాక్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కివీస్, ఇంగ్లండ్ జట్లు తీసుకున్న నిర్ణయాల వెనుక డబ్బు ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చని సందేహం వ్యక్తపరిచాడు.
తాజాగా ఓ క్రీడా ఛానల్తో ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ... 'ఆటగాళ్లకు, క్రికెట్ బోర్డులకు పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడలేమని చెప్పడం చాలా తేలికైంది. ఎందుకంటే పాకిస్థాన్ అయినందునే. ఒకవేళ అదే పరిస్థితిలో బంగ్లాదేశ్ ఉన్నా.. ఇలాగే చేస్తారు. కానీ భారత్ ఉంటే.. ఎవరూ రాలేమని చెప్పరు. ఆ ఆలోచన, ధైర్యం కూడా చేయరు. కారణం అక్కడ డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. భారత్ పదే పదే సిరీస్లు నిర్వహిస్తూ భద్రతా విషయంలో తమ దేశం మ్యాచ్లు ఆడటానికి అనుకూలంగా ఉందని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరూ తిరిగి వెళ్లడానికి కారణాలు చూపలేరు' అని అన్నాడు.
'పాకిస్థాన్లో నేనెలాంటి అభద్రతా కారణాలు చూడలేదు. కొంతమంది అక్కడ ఉండటం మంచిది కాదనే అభిప్రాయాలు తప్ప. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ జరిగేటప్పుడు కూడా చాలా మందిని అక్కడి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే సంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్లకు ముందుతో పోలిస్తే.. ఇప్పుడు వంద శాతం పటిష్ఠ బందోబస్తు ఉంది. ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదు. అక్కడ క్రికెట్ ఆడొచ్చు' అని ఉస్మాన్ ఖవాజా చెప్పాడు. ఇప్పటికే ఆరంభం అవ్వాల్సిన పాకిస్థాన్ పర్యటనను కివీస్ అర్ధాంతరంగా రద్దు చేసుకోగా.. అక్టోబర్లో వెళ్లాల్సిన పర్యటనలను ఇంగ్లండ్ రద్దు చేసుకుంది.
తాజాగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తీరును ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ తప్పుబట్టాడు. ఆటగాళ్ల సంక్షేమం కోసమని పాకిస్థాన్ పర్యటనను రద్దుచేసుకున్న ఈసీబీ.. వారిని ఐపీఎల్ 2021కు మాత్రం ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించాడు. 'మూడు నెలల పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లకు దేశం తరఫున ఆడాల్సిన అవసరం లేకుండా.. ఐపీఎల్కు అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్ చేసింది. తప్పనిసరిగా సంవత్సరంలో మూడు నెలలు ఐపీఎల్ కోసం ఈసీబీ షెడ్యూల్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈసీబీ వారి సంక్షేమం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓవైపు ఆటగాళ్ల క్షేమం కోసమని పాకిస్థాన్ పర్యటనను ఈసీబీ పెద్దలు రద్దు చేశారు. మరోవైపు బయో బబుల్ ఇబ్బందులు, అలసట ప్రభావం ఏంటో తెలిసి కూడా ఆటగాళ్లను ఐపీఎల్ 2021లో ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు?. ఈ నిర్ణయం దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్ వైదొలగడం, భారత్ మాంచెస్టర్ టెస్టు నుంచి విరమించుకోవడం కంటే చెత్తది' అని అథర్టన్ అన్నాడు.