హైదరాబాద్: భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఈ తీర్పు వార్త రాగానే మన దేశంలోని సాధారణ జనంతోపాటు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కూడా ఆనందం వ్యక్తంచేశారు.
అయితే కుల్భూషణ్ కేసులో అంతర్జాతీయ కోర్టు భారత్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. క్రికెటర్లు సెహ్వాగ్, మహ్మద్ కైఫ్లు కూడా తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తూ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లపై పాకిస్థాన్ అభిమానులు ప్రతికూలంగా స్పందించారు.

అంతర్జాతీయ కోర్టు నిర్ణయం రాగానే సెహ్వాగ్ కుల్భూషణ్ హ్యాష్ ట్యాగ్తో 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు. దానికి ఫర్హాన్ జహూర్ అనే పాకిస్తానీ వ్యక్తి స్పందించాడు. ''మీకు బుర్రలు తక్కువా? తుది నిర్ణయం ఇంకా రాలేదు, ఐసీజే స్టే ఇచ్చినా కూడా అతడిని మేం ఉరి తీస్తాం. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లంది'' అని ట్వీట్ చేశాడు.
''భారతదేశాన్ని ప్రపంచకప్లో ఓడించాలన్నట్లే ఇది కూడా మీకు కలగానే మిగిలిపోతుంది. కుక్కను పెంచుకోండి, పిల్లిని పెంచుకోండి గానీ, దురభిప్రాయాలను పెంచుకోకండి'' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ముల్తాన్ గడ్డ మీదే పాకిస్తాన్పై సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.
మరోవైపు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా ఈ అంశంపై స్పందించాడు. ''కంగ్రాచ్యులేషన్స్ ఇండియా.. అంతర్జాతీయ కోర్టుకు ధన్యవాదాలు. న్యాయం నిలబడింది'' అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆమిర్ ఆక్రమ్ అనే పాక్ యూజర్ రెచ్చిపోయాడు. ''ముందు నీ పేరు లోంచి మహ్మద్ అనే పదాన్ని తీసెయ్యి'' అని రాశాడు.
దీనికి కైఫ్ కూడా కాస్తంత ఘాటుగానే స్పందించాడు. 'వావ్.. నేను భారతదేశ విజయానికి మద్దతిస్తే, నేను మహ్మద్ అనే పేరు తీసెయ్యాలా.. నా పేరు అంటే నాకు గర్వంగా ఉంటుంది. ఆమిర్ అంటే పూర్తి జీవితం. అది నీకు ఉండాలి'' అంటూ కైఫ్ సున్నితంగా స్పందిస్తూ ఆ వ్యక్తికి చురకలంటించాడు. ఆ తర్వాత మతం, పేరు ఎవరి సొత్తూ కాదని, భారత్ వంటి సహనశీల దేశం ప్రపంచంలో మరొకటి లేదని కైఫ్ ట్వీట్ చేశాడు.