చెన్నై సూపర్ కింగ్స్ నయా సారథి రుతురాజ్ గైక్వాడ్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వారసుడిగా రుతురాజ్ సీఎస్కే బాధ్యతలు అందుకోవడం సరైన నిర్ణయమే అని అభిప్రాయపడ్డాడు. ప్రారంభంలో ధోనీని కూడా ఎవరూ నమ్మలేదని కానీ, టీ20 ప్రపంచకప్ను గెలిచిన తర్వాత కథ మారిపోయిందని సెహ్వాగ్ అన్నాడు.
ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు అయిదు టైటిళ్లు గెలిచింది. అయితే యువ క్రికెటర్ రుతురాజ్కు జట్టు పగ్గాలు అందివ్వడంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సీఎస్కే కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడాడు.

''ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అవుతాడని నేను ముందే ఊహించాను. ఎందుకంటే రుతురాజ్ దగ్గర ఆ నైపుణ్యం, ప్రతిభను చూశాను. వచ్చే ఫలితాలపై లేదా నాయకత్వ లక్షణాలను చూసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. అతని వద్ద ఈ రెండూ ఉన్నాయి. తొలి టీ20 ప్రపంచకప్ను ధోనీ గెలుస్తాడని ఎవరూ నమ్మలేదు. కానీ ధోనీ గెలిచిన తర్వాత అతనిపై అంచనాలు భారీగా పెరిగాయి''
''ఆ తర్వాత ధోనీని వన్డే కెప్టెన్గా నియమించారు. రుతురాజ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వచ్చే ఫలితాలు అతని సత్తాని నిరూపిస్తాయి. అయితే ఇప్పటికే రుతురాజ్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ప్రశాంతతతో ఉంటూ బౌలర్లను గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్గా ఉండటానికి అతనే ఉత్తమం'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
రుతురాజ్ సారథ్యలో సీఎస్కే అయిదు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చెపాక్ వేదికగా నిన్న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సాధించిన విజయంలో రుతురాజ్ కెప్టెన్గానే కాకుండా, బ్యాటర్గానూ ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో అజేయంగా 67 పరుగులు సాధించాడు. తొమ్మిది ఫోర్లు బాదాడు.