ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) ఒక మంచి ఉద్దేశంతో బ్యాటింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. టీం మెంటర్ రాహుల్ ద్రావిడ్ తోపాటు జట్టు సభ్యులందరూ బాలికల కోసం బ్యాట్ పట్టారు. బాలికల విద్యా, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమానికి 'బ్యాట్ ఫర్ గర్ల్ చైల్డ్' అనే పేరును ఖరారు చేసింది.
'రాజస్థాన్ రాయల్స్ మరో కొత్త ఇన్నింగ్ను ప్రారంభించబోతోంది. బాలికల అభివృద్ధి సంక్షేమం కోసం రాజస్థాన్ ఫ్రాంఛైజీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంలో 2శాతం కేటాయించనుంది' అని టీం వెబ్సైట్లో బుధవారం పేర్కొంది.
'ఫ్రాంఛైజీ మరో రెండు స్వచ్ఛంద సంస్థలతో సంయుక్తంగా బాలికల విద్య, సంక్షేమం కోసం పాటుపడుతోంది. ది బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్(బ్యాట్), పార్ట్ ఆఫ్ హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటీస్.. రాజస్థాన్ రాయల్స్తో కలిసి బాలికల విద్య కోసం కృషి చేస్తున్నాయి' అని తెలిపింది. భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'బేటీ బచావో బేటీ పడావో'ను స్ఫూర్తిగా తీసుకుని బాలికల విద్యా, సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది.

సిఎస్ఆర్కూడా కూడా ఆ రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి బాలికల విద్యా, సంక్షేమం కోసం పాటుపడుతోంది. కాగా, బాలికల విద్య కోసం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ సచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఎడ్యేకేట్ గర్ల్స్(www.educategirls.in), 'ఆనగాన్' (www.aanganindia.org) ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బాలికల విద్యను మెరుగుపర్చడం, బాలిక రక్షణ కార్యక్రమాలు(శక్తి) చేపడుతోంది. ఇందుకు అందరి సహకారం అవసరమని తెలిపింది.
మే 16న కోల్కతా నైట్రైడర్స్తో ముంబైలో జరిగే మ్యాచ్ సందర్భంగా 'బ్యాట్ ఫర్ ది గర్ల్ చైల్డ్'పై అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రేక్షకులు, ఆటగాళ్లందరూ కలిసి ఈ కార్యక్రమం ప్రచారం కోసం 1000 బెలూన్లను ఎగురవేయనున్నారు.