
అహ్మదాబాద్: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కోహ్లీ పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బీసీసీఐ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ టెవాటియాలు విఫలమయిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు భారత జట్టులోకి ఎంపికవ్వాలంటే.. బీసీసీఐ యో-యో పరీక్షలో 17.1 స్కోర్ చేయాలి లేదా రెండు కిలోమీటర్లను 8 నిమిషాల 30 సెకన్లలలో పూర్తిచేయాలి. ఫాస్ట్ బౌలర్లు అయితే రెండు కిలోమీటర్లను 8 నిమిషాల 15 సెకన్లలలోనే కంప్లీట్ చేయాలి.
గురువారం మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టు కోసం సృష్టించబడిన వ్యవస్థను వ్యక్తులు అర్థం చేసుకోవాలి మరియు అభినందించాలన్నాడు. 'టీమ్లో అత్యుత్తమ ప్రమాణాలు, ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యత ఇస్తాం. అందుకే ఇప్పుడు భారత్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియాకి ఆడాలంటే ఆటగాళ్లు ఆ ప్రమాణాల్ని అందుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు' అని కోహ్లీ అన్నాడు.
వరుణ్ చక్రవర్తి వరుసగా రెండోసారి బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ఎవరైనా సరే ఫిట్నెస్ టెస్టు పాస్ అయితేనే జట్టులోకి వస్తారన్నాడు. దీంతో వరుణ్ చక్రవర్తికి కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు శుక్రవారం నుంచి ప్రారంభంకాబోతున్న టీ20 సిరీస్కి ఎంపికైన వరుణ్..ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవడంతో సిరీస్ ఆడడం కష్టమేనని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ బెంగళూరులోని జాతీయ అకాడమీలో ఉన్నట్లు సమాచారం. అయితే టెవాటియా మాత్రం ప్రస్తుతం జట్టుతోనే ఉన్నాడట.
యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున 13 మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి.. 17 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 20 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన వరుణ్.. ఒక్కసారిగా భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే భుజగాయం ఆ అవకాశాన్ని దూరం చేసింది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయినా.. తాజాగా ఫిట్టెస్ టెస్టులో విఫలమవడంతో టీ20 సిరీస్కి దూరమైనట్లే కనిపిస్తోంది.