వద్దు సార్.. అతడు జట్టును నాశనం చేస్తాడు:
గ్రేట్ లేక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించిన సెమినార్లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, సీఎస్కే యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ... మహీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. 'గతంలో ఐపీఎల్లో ఒక ప్రత్యేక ఆటగాడ్ని నేను సూచించా. అతను విపరీతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు. అయినా ధోనీ వద్దన్నాడు. "వద్దు సార్.. అతడు జట్టును నాశనం చేస్తాడు" అని నాతో అన్నాడు. ఆ సమయంలో జట్టు ఐక్యంగా ఉండడమే ముఖ్యం అనుకున్నా' అని శ్రీనివాసన్ తెలిపారు.
ఆటగాడిని అంచనా వేయడంలో దిట్ట:
'ఏ ఆటగాడినైనా అంచనా వేయడంలో ఎంఎస్ ధోనీ దిట్ట. ఒక ఆటగాడి పట్ల ఒకటి ఫిక్స్ అయితే దానికి మహీ కట్టుబడి ఉంటాడు. అభిప్రాయాన్నైనా, అపోహనైనా ధోనీ తేల్చిచెబుతాడు. అతని జడ్జ్మెంట్ అలానే ఉంటుంది. అమెరికాలో చాలా ఏళ్లుగా ఫ్రాంఛైజీ కేంద్రంగా ఆటలు నడుస్తున్నాయి. భారత్లో ఇప్పుడిప్పుడే అది మొదలైంది. అయితే జూనియర్ స్థాయిలో జట్లను నడిపించిన అనుభవం ఇండియా సిమెంట్స్కు ఉంది' అని శ్రీనివాసన్ చెప్పారు.
20021 ఐపీఎల్లో కూడా ఆడుతాడు:
మహీ రిటైర్మెంట్పై అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇంతకుముందు శ్రీనివాసన్ మాట్లాడుతూ... 'ధోనీ 2020 ఐపీఎల్ ఆడుతాడు. 2020 ఐపీఎల్తో పాటు 20021 ఐపీఎల్లో కూడా ధోనీ తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. వచ్చే ఏడాది మహీ వేలంలో ఉన్నా మేమే తీసుకుంటాం. ధోనీపై నమ్మకం ఉంది, వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో ధోనీ నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం' అని శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు.
ప్రారంభం నుండి చెన్నై జట్టుకే:
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకే ఆడుతున్నాడు. సారధిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నిషేధం సమయంలో రెండు సంవత్సరాలకు పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడాడు. మహీ చెన్నై జట్టుకు మూడుసార్లు టైటిల్ అందించాడు. గతేడాది హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్తో తలపడి ఒక్క పరుగుతో చెన్నై ఓటమిపాలైంది. అయితే ఈసారి టైటిల్ గెలవాలని చెన్నై కసిగా ఉంది.