
హైదరాబాద్: మత హింస కారణంగా శ్రీలంకలో పదిరోజుల పాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. కాండీ జిల్లాలో బుద్ధులు, ముస్లింల మధ్య అల్లర్లు జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ముక్కోణపు సిరిస్ ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంకతో ఉన్న టీమిండియా భద్రతపై ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా శ్రీలంకలో ఉన్న టీమిండియా భద్రత కల్పించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు బీసీసీఐ కూడా టీమిండియా భద్రతపై స్పందించింది. లంక పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాకు శ్రీలంక అధికారులు గట్టి భద్రతను కల్పిస్తున్నారని పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని బీసీసీఐ ఓ ప్రెస్ నోట్ను విడుదల చేసింది. కాండీ జిల్లాలో మత ఘర్షణల కారణంగా కర్ఫ్యూ విధించారని, ప్రసుత్తం టీమిండియా కొలంబోలో ఉందని బోర్డు వెల్లడించింది.
కొలంబోలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని బోర్డు పేర్కొంది. అక్కడి భద్రతాధికారులతో మాట్లాడిన తర్వాత టీమిండియాకు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. గతేడాది కాలంగా కాండీ జిల్లాలోని బుద్ధులు, ముస్లింల మధ్య అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. స్థానిక ముస్లింలు మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని అక్కడి బౌద్ధ మతస్థులు ఆరోపిస్తున్నారు.
అక్కడి బౌద్ధులకు చెందిన ప్రాచీనాలయాలను ధ్వంసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న వారి సంఖ్య పెరుగుతుండటంపై కూడా అక్కడి బుద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాండీలోని ఓ ముస్లింకు చెందిన దుకాణానికి మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో గొడవ మొదలైంది.
హింస నానాటికీ పెరిగిపోతుండటంతో పది రోజుల పాటు ఎమర్జెన్సీ విధించాలని ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రతినిధి దయసిరి జయశేఖర వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు ఈ మత హింస పాకకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాండీ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.

ఇదిలా ఉంటే టీమిండియా ముక్కోణపు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనలో ఉండటంతో వాళ్ల భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిదాహాస్ ట్రోఫీ పేరిట ముక్కోణపు టీ20 సిరిస్ను నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో ఆతిథ్య శ్రీలంకతో పాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి.
1998లో తొలిసారి నిదాహాస్ ట్రోఫీ పేరిట శ్రీలంక 50 ఓవర్ల సిరిస్ను నిర్వహించింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ముక్కోణపు టీ20 సిరిస్ను నిర్వహిస్తుంది. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ముక్కోణపు టీ20 సిరిస్ రౌండ్ రాబిన్ పద్ధతిన జరగనుంది.
అంటే టోర్నీలోని ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి. టాప్లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి. ఫైనల్ మ్యాచ్తో సహా ఈ సిరిస్లోని అన్ని మ్యాచ్లు కొలంబోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.