అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది.అన్ని విభాగాల్లో విఫలమై మూడు రోజుల్లోనే ఓటమి అంగీకరించింది. అయితే మిగిలిన ఈ రెండు రోజుల సమయాన్ని వృథా చేయకుండా ప్రాక్టీస్ చేయాలని టీమిండియాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. హోటల్ గదులకే పరిమితం కాకుండా చెమటోడ్చాలన్నాడు.
అయిదు టెస్టుల సిరీస్ అని మరిచి, మూడు టెస్టుల సిరీస్గా సరికొత్తగా సన్నద్ధత మొదలుపెట్టాలని గవాస్కర్ పేర్కొన్నాడు. త్వరగా ముగిసిన అడిలైడ్ టెస్టును కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. మిగిలిన రెండు రోజుల్లో రోజంతా ప్రాక్టీస్ చేయకపోయినా, కనీసం ఉదయం లేదా మధ్యాహ్నం సాధన చేయాలని అన్నాడు. తిరిగి లయ అందుకోవడానికి ప్రయత్నించాలని తెలిపాడు.

సాధన నుంచి ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకోవాలనేది కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే నిర్ణయించాలని గవాస్కర్ అన్నాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లకు వదిలేస్తే ప్రాక్టీస్ వద్దని, రూమ్లకే పరిమితమవుతారని తెలిపాడు. భారత్ తరఫున ఆడటం గౌరవం, అదృష్టంగా భావించాలన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోని 57 రోజుల్లో.. అయిదు టెస్టులు, ప్రాక్టీస్ మ్యాచ్ కలిపి 27 రోజులు ఆడితే, దాదాపు నెల రోజుల టీమిండియాకు విరామమే అని అన్నాడు. ఇదే కాకుండా పెర్త్ టెస్టు ఒక్క రోజు ముందుగానే ముగిసిందని, కాబట్టి టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలని గవాస్కర్ పేర్కొన్నాడు.
అడిలైట్ టెస్టులో 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదన పూర్తిచేసింది. అంతకుముందు 128/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. నితీశ్ కుమార్ రెడ్డి(42; 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/57) అయిదు వికెట్లు, స్కాట్ బొలాండ్(3/51) మూడు, మిచెల్ స్టార్క్(2/60) రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 180 పరుగులు చేయగా, ఆసీస్ 337 పరుగులు సాధించింది.