IND vs PAK: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లపై అకారణంగా రెచ్చగొట్టేలా వ్యవహరిచిన పాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశ అభిమానులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ పాక్ ఆటగాళ్లకు మొట్టికాయలు వేశారు.
ఆసియా కప్లో 3 ఓటములు.. కానీ బుద్ధి మారలేదు..
ఆసియా కప్ టోర్నమెంట్లో భారత జట్టు పాకిస్థాన్తో లీగ్ దశ, సూపర్-4, ఫైనల్లో మొత్తం మూడు సార్లు తలపడింది. ఈ మూడు మ్యాచ్లలోనూ భారత్ విజయాలు సాధించింది.అయితే ఈ మ్యాచ్లలో పాకిస్థాన్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లను వదిలిపెట్టకుండా రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో టీమిండియా ప్లేయర్లు కూడా గట్టిగానే బదులిచ్చారు. ఈ విషయాన్ని భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ బహిరంగంగానే వెల్లడించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు కావాలనే రెచ్చగొట్టారని.. దానికి తాను తన బ్యాట్ ద్వారా సమాధానం చెప్పానని అభిషేక్ శర్మ స్పష్టం చేశాడు. ఫైనల్లో భారత్ను గెలిపించిన తిలక్ వర్మ కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు.

అసహనం వ్యక్తం చేసిన పాక్ ఫ్యాన్స్
పాకిస్తాన్ ఆటగాళ్ల ఈ ప్రవర్తనపై ఆ దేశ అభిమానులే తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. కఠినమైన వ్యాఖ్యలు చేశారు. "మైదానంలో బ్యాట్ మాత్రమే మాట్లాడాలి, నోరు మాట్లాడకూడదు." అని కఠినంగా కామెంట్లు చేస్తున్నారు. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించారు. అలాంటిది తాము వరుసగా ఓటములు చవిచూస్తున్నప్పుడు, భారత ఆటగాళ్లను దూషించడానికి పాక్ ఆటగాళ్లకు అర్హత లేదని అభిమానులు తేల్చి చెప్పారు.కొందరు అభిమానులు పాక్ జట్టు నాయకత్వం సరిగా లేదని విమర్శించారు. ఒక మంచి కెప్టెన్ తన ఆటగాళ్లను మందలించి, ఇలాంటి చర్యలకు దూరంగా ఉండమని చెబుతారని, కానీ ప్రస్తుత జట్టులో ఆ పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు.
మిస్బా ఉల్ హక్ ఉదాహరణ
క్రికెట్ అభిమానులు పాత రోజులను గుర్తు చేసుకుంటూ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ను ఉదాహరణగా చూపారు.2015 ప్రపంచకప్ సమయంలో ఓ పాక్ ఆటగాడు విరాట్ కోహ్లిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు, అప్పటి కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఆ ఆటగాడిని వారించి, క్రికెట్పై దృష్టి పెట్టమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత జట్టులో మాత్రం ఆటపై దృష్టి పెట్టకుండా, ఇతర విషయాల కోసం గొడవలకు దిగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అభిమానులు స్పష్టం చేశారు. "మీరు భారత ఆటగాళ్లను రెచ్చగొట్టాలనుకుంటే, ముందు మైదానంలో మీ ప్రతిభను చూపించి ఆ తర్వాత వాళ్లను రెచ్చగొట్టాలి" అని తమ సొంత ఆటగాళ్లకు సూచించారు.