హైదరాబాద్: భారత్ చేతిలో 5-0తో వైట్ వాష్కు గురైనప్పటికీ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకునేది లేదని శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ స్పష్టం చేశాడు. ఐదు వన్డేల సిరిస్లో ఆతిథ్య శ్రీలంక వైట్ వాష్కు గురవడంపై తీవ్ర విమర్శలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.
అంతేకాదు శ్రీలంకపై 5-0తో సిరిస్ను కైవసం చేసుకోవడం ద్వారా భారత జట్టు ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకలో శ్రీలంకను వైట్ వాష్ చేసిన తొలి పర్యాటక జట్టుగా అవతరించింది. ఈ నేపథ్యంలో లంక వన్డే కెప్టెన్సీ పదవి నుంచి ఉపుల్ తరంగ తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఉపుల్ తరంగ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. అసలు కెప్టెన్సీ నుంచి తప్పుకునేంత అవసరం ఏమొచ్చిందని మీడియానే ఎదురు ప్రశ్నించాడు.
'నేను కెప్టెన్సీ వదులు కోవడానికి సరైన కారణం లేదు. టీమిండియాతో ఓటమికి నేనొక్కడినే బాధ్యుణ్ని కాను. మొత్తం జట్టంతా చెత్త ప్రదర్శన చేసింది కాబట్టే ఓడాం. ప్రధానంగా మా బ్యాట్స్మెన్ సరిగా రాణించలేకపోవడం వల్లే ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాం' అని తరంగ చెప్పాడు.
'ఈ సమయం మాకెంతో కఠినమైనది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మెరుగవ్వాల్సి ఉంది. ఈ సిరీస్లో మెరుగైన స్కోరులు చేయలేకపోయాం. జట్టుకి ప్రధాన ఆటగాళ్లు దూరమయ్యారు. ఒకానొక దశలో మా జట్టు 270 పరుగులు సాధిస్తుంది అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ 238 పరుగులకే ఆలౌటైంది' అని తరంగ అన్నాడు.
ఈ సిరిస్లో లంక ఓటమికి తన బాధ్యత కొంత వరకూ ఉన్నా, పూర్తిగా తనని బలిపశువును చేయడం తగదని తరంగ తెలిపాడు. ఇక తమ జట్టు ఎలా ముందుకెళ్లాలనే దానిపై సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని అన్నాడు. జట్టులో నిలకడలేమి కారణంగా 5-0తో సిరీస్ను కోల్పోయామని తరంగ అన్నాడు.
ఇదిలా ఉంటే ఈ సిరిస్లో మిగిలున్న ఏకైక టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.