న్యూఢిల్లీ: టీమిండియాతో డిసెంబర్లో జరగాల్సిన ద్వైపాకిక్ష క్రికెట్ సిరీస్ను భారత్లో ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆ సిరీస్ ను యూఏఈలో మాత్రమే ఆడతామని ప్రకటించారు.
ఈ మేరకు భారత్లో ఆడాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని షహర్యార్ ఖాన్ తోసిపుచ్చారు. ఒకవేళ భారత్ తమతో ఆడాలనుకుంటే అది మాత్రం యూఏఈలోనే జరుగుతుందని ఆయన అన్నారు. ఇందులో మరో ప్రశ్నే లేదన్నారు.

'భారత్లో సిరీస్ ఆడే విన్నపాన్ని తోసిపుచ్చుతున్నాం. యూఏఈలో జరగాల్సిన సిరీస్ను భారత్లో నిర్వహించడానికి మేము అంగీకరించం. వేరే ప్రశ్నే లేదు'అని షహర్యార్ తెలిపారు. 2009లో లాహార్లో శ్రీలంక -పాకిస్థాన్ ల మధ్య సిరీస్ జరిగే సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
దీంతో అప్పటినుంచి పీసీబీ పాకిస్థాన్తో జరిగే సిరిస్లను స్వదేశంలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే గతేడాది బీసీసీఐ-పీసీబీల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరిస్లకు ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో భారత్-పాక్ సిరిస్ను యూఏఈలో నిర్వహించాల్సి ఉంది.