క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో మహా సమరం సిద్ధంగా ఉంది. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పొట్టి కప్ కోసం ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్ స్టేజ్లో నాలుగు గ్రూప్లుగా తొలుత పోటీపడనున్నాయి. గ్రూప్ పాయింట్ల టేబులో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
సూపర్-8కు క్వాలిఫై అయిన టీమ్స్ను రెండు గ్రూప్లు విభజిస్తారు. వీటిల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో గెలిచిన టీమ్స్ ఫైనల్కు చేరుతాయి. ఈ క్లిష్టమైన దారిలో ప్రత్యర్థులను ఓడిస్తూ తుదిపోరుకు చేరుకోవడం ఎంతంటి బలమైన జట్టుకు అయినా అంత తేలిక కాదు. పైగా వెస్టిండీస్లో పిచ్లు కఠినతరంగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లకు సమగ్ర శిక్షణ అందివ్వాలని అన్ని దేశాల బోర్డులు ముందుగానే ప్రణాళిక రచించుకున్నాయి. ద్వైపాక్షిక సిరీస్ల కంటే తీవ్ర ఒత్తిడి ఉండే ఐపీఎల్ ఆడటమే సరైన సాధన అని భావించి తమ ఆటగాళ్లను భారత్కు పంపించాయి. గాయాలపాలైన ఆటగాళ్లను మినహా మిగిలిన ప్లేయర్లను లీగ్ ఆడటానికే ప్రోత్సహించాయి. అయితే ఐపీఎల్ కంటే జట్టు కూర్పు ప్రధానమని, దాని కోసం పాకిస్థాన్తో టీ20 సిరీస్ ఉత్తమమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ నెల మొదట్లో యూటర్న్ తీసుకుంది.
ఐపీఎల్ ఆడే తమ ఆటగాళ్లను వెనక్కి రప్పించుకుంది. పాకిస్థాన్తో సిరీస్ కంటే ఐపీఎల్ ఆడటమే ప్లేయర్లకు మంచిదని, ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన జట్లలో ఉన్న ఆటగాళ్లను భారత్లోనే ఉంచాలని తమ దేశ మాజీ క్రికెటర్లు సూచించినప్పటికీ బోర్డు పట్టించుకోలేదు. పాకిస్థాన్తో జరిగే సిరీస్ సరైన ప్రాక్టీస్ అని నమ్మింది. అయితే ఇంగ్లండ్కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. పాకిస్థాన్తో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్లో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. తొలి మ్యాచ్ వర్షార్పరణం కాగా, రెండో టీ20లో పాక్పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో సునాయసంగా విజయం సాధించింది.
మూడో టీ20లో చెలరేగాలనుకున్న ఇంగ్లండ్కు వరుణుడు మరోసారి షాక్ ఇచ్చాడు. మంగళవారం జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దయింది. గురువారం జరగనున్న ఆఖరి మ్యాచ్కు కూడా వర్షం ముప్పు ఉంది. దీంతో వరల్డ్ కప్ ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లభించట్లేదు. ఇంగ్లండ్లో వర్షం పడుతుండంతో ఆటగాళ్ల రోజు వారీ సాధనకు కూడా అంతరాయం కలుగుతుంది.