
రెండు కండీషన్లు:
శ్రీలంకలో పర్యటిస్తున్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టులోకి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ని.. ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టుని ఎంపిక చేయమని స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే కోరాడు. అయితే సూర్యకు హర్షా భోగ్లే రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ యాదవ్ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురు ఎంచుకోవాలన్నది రెండోది. ఈ నిబంధనలకి లోబడి సూర్యకుమార్ తన ఐపీఎల్ ఎలెవన్ జట్టుని ఎంపిక చేశాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి చోటు దక్కలేదు.

ధోనీకి దక్కని చోటు:
సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ ఎలెవన్ జట్టుకు ఓపెనర్లుగా జోస్ బట్లర్, రోహిత్ శర్మలను ఎంచుకున్నాడు. బట్లర్ కీపర్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఎంఎస్ ధోనీకి స్థానం దక్కకుండా పోయింది. ఒకవేళ మహీకి అవకాశం ఇస్తే.. సమీకరణాలు మారనున్నాయి. అందుకే మహీకి చోటు ఇవ్వలేదు సూర్య. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. నాలుగో స్థానంలో తననే ఎంచుకున్నాడు. ఐదవ స్థానం కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ను ఎంచుకున్నాడు. తనను ఎంచుకుని హర్షా భోగ్లే పెట్టిన మొదటి కండీషన్ను అమలు చేశాడు.

ముగ్గురు ఆల్రౌండర్లకు చోటు:
సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ ఎలెవన్ జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లకు అవకాశం ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజాలకు వరుసగా 6, 7, 8 ఇచ్చాడు. స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో రషీద్ ఖాన్ను ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను సూర్య తీసుకున్నాడు. హర్షా భోగ్లే పెట్టిన రెండో కండీషన్లో భాగంగా ముంబై నుంచి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను ఎంచుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్:
జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.


Click it and Unblock the Notifications












