
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడటానికి భారత్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్ తగిలింది. విమానాల నిషేధం పూర్తయ్యేవరకూ స్వదేశానికి అనుమతించబోమని ఆ దేశ క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. నిషేధం ముగిసేవరకూ భారత్లోనే ఉండాలని క్రికెటర్లకు తెలిపింది. ప్లేయర్ల కోసం ప్రత్యేక అనుమతులు లేవని, ప్రభుత్వం కఠిన నిబంధనలను మే 15 వరకూ అమలు చేయనున్నట్లు సీఏ స్పష్టం చేసింది. అప్పటివరకూ క్రికెటర్లను దేశంలోకి అనుమతించబోమని సీఏ తెలిపింది.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ... 'నిషేధం అమల్లో ఉన్న సమయంలో భారత్ నుంచి వచ్చే ఎవరికైనా జరిమానా లేదా జైలు అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియన్లకు కూడా ఇదే వర్తిస్తుంది' అని అన్నారు. ఇక ఆసీస్ ప్రధాని విమానాల నిషేధాన్ని సమర్ధించుకున్నారు. ఇక తమ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ చేసిన 'బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్' వ్యాఖ్యలపై మోరిసన్ స్పందిస్తూ.. అది అర్థం లేని వ్యాఖ్య అని కొట్టిపారేశారు.
ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక విమానాలు వేయమని, మీరే సొంత ఖర్చులు పెట్టుకుని రావాలని పీఎం స్కాట్ మోరిసన్ కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశారు. అంతేకాకుండా నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఎవరినీ దేశంలోకి అనుమతించమన్నారు. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ ధ్వజమెత్తారు. ఇలా దేశ పౌరుల్ని వదిలేస్తారా?.. మీకెంత ధైర్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 15 వరకూ భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధిండంతో ఐపీఎల్ 2021లో ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా స్వదేశానికి చేరుకున్నారు. మిగతా ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇందుకు ఓ పరిష్కారం చూపించాడు. మొదటగా యూకే వెళ్లిపోతామని.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళతామని తన మాస్టర్ ప్లాన్ గురించి తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాల్దీవుల నుంచి ఆసీస్ చేరుకుంటారని కూడా సమాచారం.