ఇస్లామాబాద్: టీమిండియాతో ఆడాల్సిన అవసరం తమ జట్టుకు లేదని పాకిస్థాన్ ట్వంటీ20 అంతర్జాతీయ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్నాడు. ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేయడం సరికాదని తెలిపాడు.
భారత సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో వచ్చే డిసెంబర్లో జరగాల్సిన టీమిండియా- పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం లేకుండా పోయింది.
సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశం లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) తేల్చి చెప్పింది. కాగా, ఈ సిరీస్కు భారత ప్రభుత్వం కూడా అనుమతించాల్సిన అవసరం ఏర్పడింది.

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) అధ్యక్షుడు, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమయమే టీమిండియా-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్కు సరైన సమయమని పేర్కొన్నాడు.
అయితే, అఫ్రిదీ మాత్రం మరోలా స్పందించాడు. ఇండియాకు ఆసక్తి లేనట్లయితే.. సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేయకుంటేనే మంచిదని తెలిపాడు. 'ఇండియాతో సిరీస్ కోసం మనం ఎందుకు ఒత్తిడి తేవాలో తెలియడం లేదు' అని ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ అఫ్రిదీ అన్నాడు.
'ఇండియాతో సిరీస్ ఆడేందుకు ఏ కారణం నాకు కనిపించడం లేదు. ఇండియాతో మనతో ఆడేందుకు ఆసక్తి లేనప్పుడు మనం ఒత్తిడి చేయడం సరికాదు. మేము వారిని ఆహ్వానిస్తున్నాం. వారు రాలేదంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా సంతోషమే' అని తెలిపాడు.
కాగా, పాకిస్థాన్ జట్టు వచ్చే నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది. ఆ తర్వాత యూఏఈలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్లో పాల్గొననుంది.