బెర్లిన్: ప్రపంచ వ్యాప్తంగా ట్వంటీ లీగ్లతో నేటి క్రికెటర్లు డబ్బుపైనే ప్రేమ చూపిస్తున్నారని, తమ జాతీయ జట్లకు విధేయులుగా ఉండట్లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మూడు ఫార్మాట్ల మధ్య మంచి సమతూకాన్ని సాధించడం జట్లకు కష్టమవుతోందని అన్నాడు.
'సమతూకాన్ని సాధించడంలో ఆస్ట్రేలియా అన్నింటికన్నా మెరుగ్గా ఉంది. భారత్కు ఆ సామర్థ్యం ఉంది. ఇంగ్లాండ్ కూడా మంచి స్థితిలోనే ఉంది. అయితే మూడు ఫార్మాట్లు ఉన్న నేపథ్యంలో కచ్చితమైన సమతూకాన్ని సాధించడం అసాధ్యం. అన్ని ఫార్మాట్లలో ఒకే జట్టును మనం నెంబర్వన్గా చూడగలమని నేను అనుకోవట్లేదు' అని ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్టీవ్ వా చెప్పాడు.

'బ్రెండన్ మెక్కలమ్ లాంటి ఆటగాడు టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అతడిలో ఇంకా మూడు నాలుగేళ్లు ఆడగల సత్తా ఉందన్నది నా ఉద్దేశం. అతడిప్పుడు తన కుటుంబం కోసం పనిచేస్తున్నాడు. అది సమంజసమే. అయితే క్రికెట్లో మొత్తంగా చూస్తే ఆటగాళ్లకు జట్ల పట్ల ఎలాంటి విధేయతా లేదు. ఇందుకు వారిని నిందించను. అభిమానులకు ఈ పరిస్థితి ఇబ్బందికరమే' అని స్టీవ్ వా అన్నాడు.
'టెస్ట్ క్రికెట్ అనేది ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్ల నైపుణ్యం ఈ ఫార్మాట్లోనే బయటపడుతుంది. ట్వీంటీ20 క్రికెట్ అనేది క్రికెట్లో చివరిది. ఇటీవల జరిగిన ప్రపంచ టీ20 ఫైనల్ మ్యాచ్ గొప్పగా ఉందని అందరూ అంటున్నారు. నేనైతే చివరి నాలుగు బంతులే గొప్పవని అంటాను. మిగితాదంతా వృథానే. అంతకుమించి ఫైనల్ మ్యాచ్లో ఏమీ లేదు' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నాడు.