
న్యూఢిల్లీ: 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆఖరిసారిగా కనిపించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ జట్టులోకి రాలేదు. ఆలోగా కరోనా వైరస్ విజృంభణతో నాలుగు నెలలుగా క్రికెట్ సిరీస్లు వాయిదా పడ్డాయి. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్లో ధోనీ రాణించి మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ మహీ తన అభిమానులందరిని షాక్కు గురిచేస్తూ.. శనివారం (ఆగస్టు 15) అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి ఓ కీలక సూచన చేశారు. ధోనీ కోసం ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలని, జార్ఖండ్ అందుకు వేదిక అవుతుందని కూడా ప్రకటించారు. ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ కావడంతో.. ఫేర్వెల్ మ్యాచ్ కోసం రాంచీని వేదిక చేయాలని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ భావించారు. అయితే సీఎం సోరెన్ ప్రతిపాదనపై ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. బీసీసీఐ వద్ద ఫేర్వెల్ మ్యాచ్ను ధోనీ ఎప్పుడూ కోరలేదని, దీంతో ఇది జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. మహీ కోరనప్పుడు ఫేర్వెల్ మ్యాచ్ అనేది ఉండబోదన్నారు.
2007 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత 2007 టీ20 ప్రపంచకప్ సారథిగా ఎంఎస్ ధోనీకి బాధ్యతలు అప్పగించారు. అందివచ్చిన అవకాశాన్ని మహీ సద్వినియోగం చేసుకున్నాడు. కుర్రాళ్లతో కూడిన జట్టుతో తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ను నిలబెట్టాడు. దీంతో అతడి అభిమానుల సంఖ్య తారాస్థాయికి పెరిగింది. అతడిలానే యువత హెయిర్ కట్ను అనుకరిస్తూ ధోనీని ఆరాధించారు. తర్వాత భారత్ జట్టుకు పూర్తిస్థాయి సారథిగా మారాడు. ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులను సాధించాడు. 2009లో టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత అభిమానుల ప్రపంచకప్ కలను సాకారం చేశాడు. అంతేకాకుండా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. ఇలా భారత క్రికెట్లో సరికొత్త అధ్యయనాన్ని నెలకొల్పాడు.
2007లో టీమిండియా కెప్టెన్గా తొలిసారి పగ్గాలు అందుకున్న ఎంఎస్ ధోనీ.. 2017 వరకూ ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలో 200 వన్డేలు, 60 టెస్టులు, 72 టీ20 మ్యాచ్లకి ధోనీ నాయకత్వం వహించాడు. మొత్తంగా 332 మ్యాచ్లకి ధోనీ కెప్టెన్గా ఉండగా.. అతని తర్వాత స్థానంలో 324 మ్యాచ్లతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచులు ఆడాడు.