ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు తొలగింపు
ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ల ప్రసారాన్ని కూడా బ్రాడ్కాస్టింగ్ అధికారులు నిలిపివేశారు. తాజాగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వరల్డ్కప్లో పాక్తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది.
జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్లో ముందస్తు షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ జట్ల మధ్య జూన్ 16న ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ సెక్రటరీ సురేశ్ బఫ్నా మాట్లాడుతూ "దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదు. దీనిపై ఇమ్రాన్ కనీసం స్పందించాల్సి ఉంది" అని అన్నారు.
ఉగ్రదాడిపై ఇమ్రాన్ మాట్లాడాలి
"దీనిపై ఆయన ఏమీ మాట్లాడటం లేదంటే వాళ్లవైపు కొంత తప్పుందనే నిర్ధారణకు రావాల్సిఉంటుంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈ దాడిపై ఇమ్రాన్ ఖాన్ కచ్చితంగా మాట్లాడి తీరాలి" అని ఆయన అన్నారు.
వరల్డ్కప్లో పాకిస్థాన్తో భారత్ ఆడకూడదు
"వాళ్ల దేశం వైపు ఏ తప్పూలేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అందుకే వరల్డ్కప్లో పాకిస్థాన్తో భారత్ ఆడకూడదు. ఈ మేరకు బీసీసీఐని కోరాం" అని ఆయన అన్నారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరగబోయే వరల్డ్కప్లో ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జూన్ 16న మ్యాచ్ జరగనుంది.