
సరైన స్పష్టత లేదు:
తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయటానికి విరాట్ కోహ్లీ ఇష్టపడతాడు. ఇదే అతడిని విమర్శల పాలు చేస్తోంది. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ దీనిపై తన అభిప్రాయాన్ని తాజాగా తెలియజేశాడు. ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ జట్టును ఎంపిక చేసే విషయంలో కోహ్లీకి స్పష్టత కొరవడిందన్నాడు. 'ఈ టీమిండియాలో సరైన స్పష్టత లేదు. అది మనం అంగీకరించాలి. కోహ్లీ ఇలా ఉండకూడదు. ఆటగాళ్లలో ఎవరు ఫామ్లో ఉంటే వాళ్లనే తుది జట్టులోకి తీసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి విరాట్ ఎన్ని ట్రోఫీలు సాధించాడో అని ప్రశ్నించాల్సి ఉంటుంది' అని కైఫ్ అన్నాడు.

ఏం సాధించలేదని తెలుస్తుంది:
'ఓ ఆటగాడు ప్రస్తుత ఫామ్ గురించే విరాట్ కోహ్లీ చూస్తాడు. ఇదే ఫార్ములా కారణంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లకు అవకాశాలు లభించాయి. అదే సమయంలో శిఖర్ ధావన్ కొన్ని మ్యాచులు ఆడలేదు, రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చారు. ఇలానే కొనసాగితే చివరకు విరాట్ కోహ్లీ ఏం సాధించలేదని తెలుస్తుంది. ఈ జట్టు, యాజమాన్యం.. ఆటగాళ్లు గతంలో ఏం చేశారనేదానికి ప్రాధాన్యత ఇవ్వరు. దాంతో ఈ భారత జట్టులో ఎవరి స్థానమూ కచ్చితం కాదు. అది ఆటగాళ్లకు కూడా తెలుసు. అప్పుడు మంచి ప్రదర్శనలు ఎలా వస్తాయి. ఆటగాళ్లు జట్టులో స్థానం కోసమే ఆడుతారు. ఆ క్రమంలో ఒత్తిడికి లోనవుతారు' అని మొహమ్మద్ కైఫ్ చెప్పాడు.

దాదా వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు:
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై మాజీ బ్యాట్స్మన్ మొహమ్మద్ కైఫ్ స్పందించాడు. గంగూలీ జట్టులోని ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడని చెప్పాడు. దాదా కెప్టెన్గా ఉన్న రోజుల్లో 20-25 మంది మాత్రమే జట్టులోకి అందుబాటులో ఉండేవారని, అప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి టోర్నీ లేకపోవడంతో ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పెద్ద తలనొప్పులు ఉండేవి కాదన్నాడు. గంగూలీ తన సహచరులకు ఎప్పుడూ మద్దతుగా ఉండేవాడని కైఫ్ తెలిపాడు. ఆటగాళ్లను ఎక్కువ రోజులు ప్రోత్సహించకపోతే కీలక సమయాల్లో రాణించరని కైఫ్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీకి కలిసిరావడం లేదు:
ఐసీసీ ట్రోఫీలు విరాట్ కోహ్లీకి కలిసిరావడం లేదు. ఓ సాధారణ ప్లేయర్గా 2011లో ప్రపంచకప్ అందుకునే అవకాశమైతే కోహ్లీకి దక్కింది కానీ.. ఓ కెప్టెన్గా మాత్రం ఐసీసీ టోర్నీలు అతనికి అందని ద్రాక్షగానే మిగిలింది. భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఫేవరెట్గా దిగినా.. చివరికి ఓటమి తప్పలేదు. వర్షం రూపమ్లో దురదృష్టం మాత్రం కోహ్లీని నీడలా వెంటాడింది. దాంతో పాటు ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఉండే ఒత్తిడిని ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలాగా కూల్గా అధిగమించలేకపోవడం కూడా అతడిని దెబ్బకొడుతోంది. మరి ఎప్పుడు ఐసీసీట్రోఫీ గెలుస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications












