
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్.. క్రమంగా కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు పలువురు క్రికెటర్లకు భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి- విదేశీ ఆటగాళ్లు. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్దీ అదే పరిస్థితి.
తాజాగా- ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా స్వదేశానికి తిరుగుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో గ్లెన్ మ్యాక్స్వెల్ కీలక బ్యాట్స్మెన్గా ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకోనే అవకాశాలు ఉన్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధిం విధించే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధినేత సౌరభ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2021 నిర్వహణలో ఇప్పటిదాకా ఎలాంటి కీలక మార్పులు చేయదలచుకోలేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవట్లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఈ సీజన్ కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నివేదికలను తెప్పించుకుంటున్నామని వివరించారు. కరోనా పరిస్థితులు చేయి దాటిపోయాయని, అయినప్పటికీ- టోర్నమెంట్ను కొనసాగించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
క్రికెటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి అనేక చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ను కొనసాగిస్తామని ఇండియా స్పోర్ట్స్కు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు ఉంటాయని అన్నారు. షెడ్యూల్లో మార్పులు చేయడం, వేదికలను మార్చాలనే దిశగా ఆలోచన చేయలేదని చెప్పారు. పరిస్థితులన్నింటిపైనా సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతే వేదికలను ఖరారు చేశామని సౌరబ్ గంగూలీ అన్నారు.