ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసియా కప్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టోర్నీకి ఎంపిక చేసే జట్టులో కేరళ యంగ్స్టర్ సంజూ శాంసన్కు మొండిచెయ్యి చూపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీసులో శాంసన్ తేలిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో ఆసియా కప్ ఆడే జట్టులో అతన్ని ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు భావిస్తున్నారట. గాయాల నుంచి కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ ఆసియా కప్ నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి వీరిని ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. అందుకే సంజూను పక్కన పెట్టేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

మంచి ట్యాలెంట్ ఉన్న సంజూ నిలకడగా రాణించకపోవడం టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే అతనికి ఒక స్థానం కన్ఫర్మ్ చేయకుండా.. అటూ ఇటూ మార్చడం కూడా దీనికి కారణమే. దీనికి పెద్ద ఉదాహరణ విండీస్తో జరిగిన వన్డే సిరీస్. ఈ సిరీసులో నాలుగో స్థానంలో వచ్చిన అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
కానీ ఆ తర్వాత టీ20ల్లో సంజూను ఫినిషర్గా ఆడించే ప్రయత్నం చేసింది టీం మేనేజ్మెంట్. సహజంగా టాపార్డర్ ప్లేయర్ అయిన అతను లోయర్ ఆర్డర్లో రాణించలేకపోయాడు. ఈ కారణంగా అతన్ని జట్టులో రిప్లేస్ చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కనుక మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే సంజూకు ఛాన్స్ దక్కడం కష్టమే అని నిపుణుల అభిప్రాయం. అదే సమయంలో ఆసియా కప్లో కూడా ప్రసిద్ధ్ కృష్ణను ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.
అతని చేరికతో టీమిండియా పేస్ బౌలింగ్ మరింత బలోపేతం అవుతుందని వారి భావన. బుమ్రా, ప్రసిద్ధ్ ఇద్దరూ కూడా ఐర్లాండ్తో టీ20లు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీసులో వాళ్ల ఫిట్నెస్ను సెలెక్టర్లు పరిశీలిస్తారట.