హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమికి కారణమైన నో బాల్ చాలా కాలం పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాని వేధిస్తుందని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
'ఈ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్లో నో బాల్ వేయడం అతన్ని చాలాకాలం బాధిస్తుంది. ఆ ఓటమి పాకిస్తాన్పై కాబట్టి ఆ నో బాల్ వేదన చాలా ఎక్కువగా ఉంటుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమికి బుమ్రా వేసిన నో బాల్ కూడా ఓ కారణం. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే పేసర్ బుమ్రా పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ను అవుట్ చేశాడు. ఆ సమయంలో ఫకార్ వ్యక్తిగత స్కోరు 3 పరుగులు.
అయితే అది కాస్త నో బాల్ కావడంతో అతడికి లైఫ్ వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫకార్ జమాన్ తన తొలి వన్డే సెంచరీతో చెలరేగడంతో పాటు పాకిస్థాన్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. దీంతో నోబాల్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఫైనల్లో భారత్ ఓటమికి బూమ్రా బౌలింగ్ కారణమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.