
హైదరాబాద్: ప్రపంచ నం.1 జట్టు ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవాలని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సిన కోహ్లీ సేనను ఉద్దేశించి గంభీర్ పలు వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో మాదిరిగానే విదేశాల్లోనూ ఇదే స్థాయిలో రాణించాలన్నాడు.
'దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ సేన విజయవంతమవుతుందన్న నమ్మకముంది. బ్యాట్స్మెన్లు వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే మన బౌలర్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా 20 వికెట్లను దక్కించుకోగలరు.స్వదేశంలో కోహ్లీ సేన అద్భుత విజయాలు నమోదు చేసుకుంది. ఇదే జైత్రయాత్రను ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై కొనసాగించాలి' అని కోరుకుంటున్నట్లు గౌతి చెప్పాడు.
గౌతమ్ గంభీర్.. భారత జట్టులో స్థానం కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న క్రికెటర్. అయితే జట్టులో స్థానం కోసం తాను సెలక్టర్లతో మాట్లాడనని.. పరుగులు సాధించడంపైనే పూర్తి దృష్టి పెడతానని అంటున్నాడు గౌతమ్.
'బ్యాట్తో పరుగులు సాధించడమే మనం చేయగలిగింది. జట్టులోకి ఎంపిక చేసేది లేనిది సెలక్టర్ల నిర్ణయం. నాకు స్థానం కల్పించాలని నేను వెళ్లి వారిని అడగను. పరుగులు సాధించడమే నా పని. దీనిపైనే ఇప్పుడు నా దృష్టంతా. గత ఏడాదికి.. ఈ ఏడాదికి నా ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడు ఇప్పుడు ఒకే ఆలోచనతో ఉన్నాను. చూద్దాం వచ్చే ఏడాది ఏం జరుగుతుందో' అని గౌతి అన్నాడు. అతను ప్రస్తుతం రంజీ ట్రోఫీలో దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటలీలో విరుష్క వివాహం గురించి భాజపా నేత చేసిన వ్యాఖ్యలపై గంభీర్ మాట్లాడుతూ.. 'ఎక్కడ వివాహం చేసుకోవాలన్నది పూర్తిగా వారి ఇష్టం. దీనిపైన ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తపడాలి' అని గంభీర్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.