అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదన పూర్తిచేసింది. నాథన్ మెక్స్వీనీ(10 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా(9 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు 128/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. నితీశ్ కుమార్ రెడ్డి(42; 47 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/57) అయిదు వికెట్లు, స్కాట్ బొలాండ్(3/51) మూడు, మిచెల్ స్టార్క్(2/60) రెండు వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 180 పరుగులు చేసింది.

మొదటి ఇన్నింగ్స్లోనూ నితీశ్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)నే టాప్ స్కోర్. ఆసీస్ 337 పరుగులు సాధించింది.ట్రావిస్ హెడ్ (140; 141 బంతుల్లో, 17 ఫోర్లు, 4 సిక్సర్లు), లబుషేన్ (64; 126 బంతుల్లో, 9 ఫోర్లు) సత్తాచాటారు. అయితే భారత రెండు ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఏడో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చి ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన భారత నాలుగో బ్యాటర్గా చరిత్రకెక్కాడు.
అంతకుముందు ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. 1961-62లో కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో చందు బోర్డే, 2011లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో ఎంఎస్ ధోనీ, 2018లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. తాజాగా అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో నయా ఆల్రౌండర్ నితీశ్ సత్తాచాటి ఈ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.