హైదరాబాద్: భారత క్రికెటర్లకు పెళ్లి కళ వచ్చేసింది. ఒక్కొక్కరుగా వివాహానికి సిద్ధమైపోతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం మొదలుకొని వరుస వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం మయాంక్ అగర్వాల్ ఓ ఇంటివాడు కాగా రెండు రోజుల క్రితం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సందీప్ శర్మ కూడా తన స్నేహితురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.
తాజాగా మరో ఆటగాడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. అతడు మరెవరో కాదు. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన నితిశ్ రాణా. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో నితిశ్ రాణాకు తన స్నేహితురాలు సాచిన మార్వాకు నిశ్చితార్థం జరిగింది. ముఖ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకను నిర్వహించారు. రాణా సహచర ఆటగాడు దృవ్ శర్మ ఈ వేడుకకు హాజరయ్యాడు.
రాణా-సాచి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను దృవ్ సోషల్మీడియా ద్వారా పంచుకుని శుభాకాంక్షలు తెలిపాడు. రాణా-సాచిల పెళ్లి తేదీ ఇంకా ఖరారు చేయలేదు. వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడిన రాణా మొత్తం 15 మ్యాచ్ల్లో 304 పరుగులు చేశాడు. అంతేకాదు 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
గతేడాది రాణా ముంబై ఇండియన్స్కు ఆడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్కు మిడిలార్డర్లో రాణించిన రాణా అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. టోర్నమెంట్ మొత్తంలో ఆల్ రౌండర్ ప్రదర్శనతో చక్కటి ప్రదర్శన చేయగలిగాడు. స్వతహాగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ నేపథ్యంతో రాణించిన రాణా చాలా టోర్నమెంట్లలో అవార్డులు గెలుచుకున్నాడు.