ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL) 2025లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీష్ రాణా తన అద్భుతమైన ఫామ్కు కారణం వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు జేబులో హనుమాన్ చాలీసా పెట్టుకుంటానని, దాని నుంచే తనకు శక్తి వస్తుందని నితీష్ రాణా చెప్పాడు. "నేను జేబులో పెట్టుకుని బ్యాటింగ్ చేస్తాను" అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో నితీష్ రాణా అన్నారు. నితీష్ రాణా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి.
క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టుపై వెస్ట్ ఢిల్లీ లయన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి డీపీఎల్ 2025 ఫైనల్కు చేరుకుంది. ఈ టోర్నమెంట్లో నితీష్ రాణా ఇప్పటివరకు 10 మ్యాచ్లలో 188.02 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసి తన జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.

క్వాలిఫైయర్ 2 మ్యాచ్ వివరాలు ఇలా..
మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. దీంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ముందు 140 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది. లక్ష్యఛేదనలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఓపెనర్ అంకిత్ కుమార్ తక్కువ స్కోరుకే ఔటైనా, మరో ఓపెనర్ క్రిష్ యాదవ్ (37), ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ దోసెజా (54) జట్టును నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత నితీష్ రాణా క్రీజులోకి వచ్చి, ఆయుష్ దోసెజాతో కలిసి అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 26 బంతుల్లో 45 పరుగులు చేసి, తనదైన శైలిలో సిక్సర్లతో విజయాన్ని ఖరారు చేశాడు. దోసెజా 49 బంతుల్లో 54 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు.
ఫైనల్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్తో పోరు
ఈ విజయంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో వారు బలమైన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టుతో తలపడనున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నితీష్ రాణా తన అద్భుతమైన ఫామ్ను ఫైనల్లో కూడా కొనసాగిస్తాడని జట్టు ఆశిస్తోంది. తన ఆటతీరుకు మతపరమైన విశ్వాసాలను జోడించి నితీష్ రాణా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీశాయి.