తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సూపర్ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దుమ్మురేపాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య జరిగిన పోరులో కీలకమైన హ్యాట్రిక్ సాధించి ఆంధ్ర జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఆంధ్ర జట్టు కేవలం 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించినప్పటికీ.. నితీశ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ప్రదర్శనతో మధ్యప్రదేశ్ను ఛేజింగ్లో ఆదిలోనే దెబ్బతీశాడు.
మధ్యప్రదేశ్ టాపార్డర్ను దెబ్బ తీసిన నితీశ్
ఆంధ్ర తరఫున ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి, మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లోని మూడో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి తన తొలి టీ20 హ్యాట్రిక్ను నమోదు చేసుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో బౌలింగ్కు వచ్చి, మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లోని మూడో ఓవర్లో చివరి మూడు బంతులకు వరుసగా వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. హర్ష్ గావ్లీని ఔవుట్ చేసి వికెట్ల వేట ప్రారంభించాడు. తరువాత బంతికి హర్ప్రీత్ సింగ్ భాటియాను కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపాడు. చివరి బంతికి, ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న రజత్ పాటిదార్ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. నితీశ్ రెడ్డి ఈ ట్రిపుల్ స్ట్రైక్తో మధ్యప్రదేశ్ స్కోరు 14/3గా మారింది.

బ్యాటింగ్లోనూ కీలక పాత్ర
నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణించాడు. 112 పరుగుల స్వల్ప స్కోరు వద్ద ఆంధ్ర జట్టు ఆలౌట్ అయినప్పటికీ, నితీశ్ ఆ జట్టులో రెండో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. నితీశ్ 27 బంతుల్లో 25 పరుగులు చేసి, ఆంధ్ర జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడానికి దోహదపడ్డాడు. కాగా నితీశ్ ఈ హ్యాట్రిక్కు ముందు, తన టీ20 కెరీర్లో 37 మ్యాచ్లలో కేవలం 8 వికెట్లు మాత్రమే తీశాడు. 2/17 ఉత్తమ ప్రదర్శనగా ఉంది. ఈ హ్యాట్రిక్తో నితీశ్ తన బౌలింగ్ పరాక్రమాన్ని నిరూపించుకున్నాడు.