సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భవిష్యత్ తారగా అందరి దృష్టిలో పడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు మెరుపు ఫీల్డింగ్ చేయగలిగే నితీశ్ను మరో హార్దిక్ పాండ్య చేయాలని బీసీసీఐ కూడా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు కూడా ఎంపికయ్యాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు.
ఐపీఎల్-2023 సీజన్లోనే నితీశ్ కుమార్ అరంగేట్రం చేసినప్పటికీ స్టార్డమ్ మాత్రం గత సీజన్లో పొందాడు. ఆల్రౌండర్ షోతో సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. సీజన్ ప్రారంభానికి ముందు నుంచే మంచి లయలో ఉన్న నితీశ్ అదే జోరును ఐపీఎల్ 2024లోనూ కొనసాగించాడు. అయితే తన సక్సెస్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాత్ర కూడా ఉందని తెలుగు తేజం నితీశ్ చెప్పాడు.

కమిన్స్ మాటలు తనని మరింత ఉత్సాహంతో ఆడేలా ప్రేరేపించాయని చెప్పాడు. ''సీజన్ ప్రారంభానికి మూడు రోజుల ముందు కమిన్స్ జట్టుతో చేరాడు. ఆలోపు నేను ప్రాక్టీస్ గేమ్లో సత్తాచాటాను. కోచ్లను ఆకట్టుకున్నాను. కెప్టెన్ కమిన్స్ను కూడా ప్రాక్టీస్ గేమ్స్ను చూసుంటే బాగుండేది అనిపించింది. నేను ఎలా ఆడతానో, గేమ్ను ఎలా అర్థం చేసుకుంటానో కెప్టెన్ చూడాల్సిందని అనుకున్నాను''
''అయితే జట్టుతో చేరిన తర్వాత కమిన్స్ నాతో ఇలా అన్నాడు. 'నితీశ్ నువ్వు బాగా ఆడుతున్నావు'. కమిన్స్ అలా చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఎందుకంటే అతను ప్రాక్టీస్ గేమ్స్ చూడలేదు. దాని గురించి కమిన్స్ను అడిగాను. అయితే నా ఆటను అతను ముందుగానే యూట్యూబ్లో చూశాడని, అందుకే కొనియాడానని కమిన్స్ చెప్పాడు. ఆ మాట ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది'' అని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు.
కాగా, గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆద్యంతం సత్తాచాటిన ఎస్ఆర్హెచ్.. కేకేఆర్తో జరిగిన ఫైనల్లో తడబడింది. టైటిల్ చేజార్చుకుని రన్నరప్గా నిలిచింది. ట్రోఫీ సాధించనప్పటికీ అత్యధిక జట్టు స్కోర్ల రికార్డును బద్దలుకొట్టి, చరిత్రను తిరగరాసింది. 2023లో పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచిన హైదరాబాద్ 2024లో రన్నరప్గా సత్తాచాటడం విశేషం.