ఐపీఎల్-2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తాచాటుతోంది. సమష్టి ప్రదర్శనతో మరో విజయాన్ని సాధించింది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
అయితే సన్రైజర్స్ 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (64; 37 బంతుల్లో, 4x4, 5x6) అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. తొలుత సంయమనంతో ఆడిన నితీశ్ రెడ్డి తాను ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 14 పరుగులే చేశాడు. కానీ ఆ తర్వాత పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అర్ధశతకంతో సత్తాచాటి పంజాబ్ ముందు సవాలైన లక్ష్యాన్ని ఉంచాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 180 పరుగులకే పరిమితమైంది. శశాంక్ సింగ్ (46*; 25 బంతుల్లో, 6x4, 1x6), అశుతోష్ శర్మ (33*; 15 బంతుల్లో, 3x4, 2x6) గట్టిగా పోరాడారు. భువనేశ్వర్ కుమార్ (2/32), కమిన్స్ (1/22) ఆకట్టుకున్నారు. బ్యాటుతో సత్తాచాటిన నితీశ్ రెడ్డి బంతితోనూ మెరిసాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన నితీశ్ 33 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అంతేగాక ఓ క్యాచ్ను అందుకున్నాడు.
ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 50 పరుగులు, ఓ వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీశ్ చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లలో ఈ ఘనతను ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ సాధించలేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరఫున ప్రాతినిథ్యం సాధించని ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ప్రస్తుత 17వ సీజన్తో కలిపి ఎంతో మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడారు. కానీ ఈ అరుదైన రికార్డును వైజాగ్కు చెందిన 20 ఏళ్ల తెలుగు కుర్రాడు ఒక్కడే సాధించడం విశేషం.