ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభమైంది. పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ కు టాస్ కూడా పడింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీంతో- మూడు మ్యాచ్ల వనన్డే సిరీస్ కు శ్రీకారం చుట్టినట్టవుతుంది. వన్డే కేప్టెన్ గా అపాయింట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మ్యాచ్ లో అందరి చూపూ మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీదే నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. 2027 ఐసీసీ వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్ లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కేప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం అతనిపై మరింత ఉండే అవకాశం లేకపోలేదు. ఈ మూడు మ్యాచ్ లల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కేరీర్ క్లోజ్ అవ్వక తప్పకపోవచ్చు.

కాగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో ఎంట్రీ ఇచ్చారు. టెస్ట్, టీ20ల నుంచి ఇదివరకే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్ లో కొనసాగుతున్నారు. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కేప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు.
వర్షం పడే అవకాశం ఉండటం వల్ల మ్యాచ్ కు స్వల్పంగా అంతరాయం కలిగినప్పటికీ పిచ్ బాగుందని, మంచి స్కోరు సాధించడమే తమ లక్ష్యమని చెప్పాడు. ఈ మ్యాచ్ ద్వారా నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. అతను ఆడుతున్న తొలి వన్డే మ్యాచ్ ఇదే. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగింది టీమిండియా. ఈ కూర్పు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని, ఆల్ రౌండర్లను తీసుకోవడానికి పిచ్ ఓ కారణమని గిల్ వివరించాడు.
టీమిండియా తుదిజట్టులో- శుభ్మన్ గిల్ (కేప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.
ఆస్ట్రేలియా తుదిజట్టులో- మిచెల్ మార్ష్ (కేప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కానలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నేమాన్, జోష్ హేజిల్వుడ్ కు చోటు దక్కింది.