నీతా అంబానీ.. దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలానే ఓవైపు రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు ఫ్రాంఛైజీ క్రికెట్ వ్యవహారాలూ చూసుకుంటుంటారు. అలానే పలు సందర్భాల్లో టీమిండియా అపురూప విజయాలను సాధించినప్పుడు, ఆటగాళ్లను అభినందించడంతో పాటు వారికి సత్కారాలు కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఆమె.. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత ఖరీదైన బుగాటీ కారును బహుమతిగా ఇచ్చినట్లు నెట్టింట్లో ఫొటోలు వైరల్ గా మారాయి.
అంతా మాయ..
నీతా అంబానీ.. రోహిత్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఫొటోలు చక్కర్లు కొట్టడంతో, క్రికెట్ అభిమానులు ఆ ఫొటోలను మరింత షేర్ చేశారు. కానీ వాస్తవంగా ఆ వార్తలో నిజం లేదని తెలిసింది. ఆ ఫొటోలు పూర్తిగా ఏఐ సాయంతో రూపొందించినవని అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఫొటోల్లో ఉన్న ముఖాలను చూస్తే అవి ఫేక్ అని అర్థమైపోతుంది. పైగా నీతా అంబానీ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు రాలేదు. రిలయన్స్ నుంచి కూడా ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. కాగా, ఈ మధ్య కాలంలో ఏఐ జనరేటెడ్ టూల్స్ ఫ్రీగా భారీగా అందుబాటులోకి రావడంతో.. ఇలాంటి మాయ ఫొటోలు ఎక్కువగా నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి.

ఇకపోతే.. నీతా అంబానీ యజమానిగా వ్యవహరిస్తోన్న ఐపీఎల్ ముంబయి ఇండియన్స్ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొంతకాలం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్ లవర్స్ ఫేస్బుక్ పేజీ నుంచి ఈ ఖరీదైన కారు గిఫ్ట్కు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి.