కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను 58 నిమిషాల పాటు ప్రసంగించారు. 2019 నుంచి వరుసగా ఆమె ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ బడ్జెట్ రికార్డును ఆమె సమం చేశారు.
అయితే గత ప్రసంగాలతో పోల్చుకుంటే నిర్శల సీతారామన్ ఈ సారి తక్కవ సమయంలోనే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. 2019లో ఆమె తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 128 నిమిషాలు మాట్లాడారు. 2020లో ఏకంగా 159 నిమిషాల పాటు రికార్డు ప్రసంగం వినిపించారు. ఆ తర్వాత వరుసగా 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు, 2023లో 87 నిమిషాలు తాజాగా 58 నిమిషాలు మాట్లాడారు.

తాజా ప్రసంగంలో నిర్మల సీతారామన్ క్రీడల గురించి మాట్లాడారు. క్రీడా రంగంలో భారత్ సాధించిన పురోగతిని తెలియజేశారు. గతంతో పోల్చుకుంటే గ్రాండ్ మాస్టర్లు గణనీయంగా పెరిగారని, అలాగే ఆసియా క్రీడల్లో పతకాల సంఖ్యను మూడంకెలకు చేరుకున్నామని వివరించారు.
''యువత క్రీడల్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నందుకు దేశం గర్విస్తోంది. ఏషియన్ గేమ్స్, ఆసియా పారా క్రీడల్లో 2023లో అత్యధిక పతకాల సంఖ్యను సాధించడం మన సత్తాకు నిదర్శనం. మన నంబర్ వన్ ర్యాంకర్ చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్ కార్ల్సన్కు 2023లో గట్టిపోటీనిచ్చాడు. 2010లో దేశంలో 20 మంది కంటే తక్కవగా గ్రాండ్మాస్టర్లు ఉండగా, ఇఫ్పుడు 80 మందికి పైగా ఉన్నారు'' అని సీతారామన్ పేర్కొన్నారు.
ఇటీవల ఆర్ ప్రజ్ఞానంద ఫిడే ర్యాంకింగ్స్లో దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత టాప్ ర్యాంకర్గా నిలిచిన విషయం తెలిసిందే. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ సత్తాచాటి ఈ ఘనత సాధించాడు.కాగా, గతేడాది జరిగిన చెస్ ప్రపంచకప్లో ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. కార్ల్సన్కు గట్టి పోటీనిచ్చి టైటిల్ను తృటిలో కోల్పోయాడు. తొలిరౌండ్ తొలిగేమ్లో ప్రజ్ఞానందపై విజయం సాధించి, రెండో గేమ్ను డ్రాగా ముగించి కార్ల్సన్ ఛాంపియన్గా నిలిచాడు. అయితే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అంతేగాక, ప్రపంచకప్లో ఫైనల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.