
ముంబై: దేశంలో కోవిడ్-19 వ్యాప్తి ఉన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను నిర్వహించినందుకు భారత నియంత్రణ మండలిని విమర్శించడం తప్పు అని బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా అన్నారు. భారతదేశంలో ఐపీఎల్ టోర్నీని నిర్వహించి బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని, అందుకు తాను మద్దతుగా నిలిచానన్నారు. ఐపీఎల్ మన టోర్నమెంట్ అని, ప్రతిసారీ యూఏఈకి వెళ్లలేం అని షా పేర్కొన్నారు. టోర్నీలో కరోనా కేసులు పెరగడంతో గత మంగళవారం అనూహ్య పరిస్థితుల్లో బీసీసీఐ ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే.
దేశంలో కోవిడ్-19 సెకండ్ వెవ్ వ్యాప్తి భారీ స్థాయిలో ఉన్నా కూడా బీసీసీఐ ఐపీఎల్ 2021ను నిర్వహించింది. 29 మ్యాచులు ముగియగానే టోర్నీ నిరవధిక వాయిదా పడింది. దీంతో బీసీసీఐపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా స్పందించారు. తాజాగా నిరంజన్ షా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ... 'భారతదేశంలో ఐపీఎల్ 2021ని నిర్వహించి బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది. బీసీసీఐ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే.. ఐపీఎల్ మన టోర్నమెంట్, ప్రతిసారీ యూఏఈకి వెళ్లలేం' అని అన్నారు.
'ఐపీఎల్ 2021 ప్రారంభమైనప్పుడు కాని అంతకు కొన్ని వారాల ముందు పరిస్థితి బాగానే ఉంది. దేశీ టోర్నీలు, ఇంగ్లండ్ సిరీస్ విజయవంతం అయ్యాయి. కాబట్టి ఐపీఎల్ను కూడా భారతదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. యూఏఈ మాదిరిగానే సురక్షితమైన వాతావరణంలో ఆతిథ్యం ఇస్తామనే నమ్మకం వారికి కలిగింది. ఇక టోర్నమెంట్ కొన్ని వారాల పాటు బాగా జరిగి ఆగిపోయింది. ఇది మంచి ప్రయత్నమే. టోర్నీలో మిగిలిన 31 మ్యాచ్లను పూర్తి చేయడానికి బీసీసీఐ 30 రోజుల విండోను వెతుకుతోంది. అంతర్జాతీయ షెడ్యూల్లో ఖాళీ సమయం ఎప్పుడు ఉంటుందో చూసుకోవాలి. కొంచెం ఆలస్యంగా దేశీయ టోర్నమెంట్లను ప్రారంభిస్తే ఐపీఎల్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది' అని షా అన్నారు.
'ఐపీఎల్ 2021 జరగకపోతే బీసీసీఐకి పెద్ద నష్టమే. ఇప్పటికే సగం టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి సగం యుద్ధంలో విజయం సాధించారు. యుద్ధం ముగించడానికి మరో నాలుగు వారాలు అవసరం. రాబోయే 2-3 నెలల్లో దేశంలో కరోనా పరిస్థితి మెరుగుపడుతుందని నేను భావిస్తున్నా. ఆ సమయంలో బీసీసీఐ ఐపీఎల్పై సరైన నిర్ణయం తీసుకోవచ్చు' అని బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా అన్నారు. మొదటగా కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కు పాజిటీవ్ రాగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, హైదరాబాద్ కీపర్ వృద్దిమాన్ సాహా, చెన్నై కోచ్లు లక్ష్మీపతి బాలాజీ, మైఖేల్ హస్సిలు మహమ్మారి బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది.