ముంబై: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రస్తుతం తన కూతురితో ఆనందంగా గడుపుతున్నాడు. శనివారం రహానే భార్య రాధికా ధోపావ్కర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడుతున్న నేపథ్యంలో రహానే కూతురు పుట్టిన విషయం తెలిసినా.. వెంటనే అక్కడికి వెళ్లలేకపోయాడు. తొలి టెస్టు ముగిసిన తర్వాత రహానే తన కూతురి చూడటానికి వెళ్ళాడు. తన కూతురిని చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు. భార్యతో కలిసి చిన్నారిని తనవి తీరా చూస్తున్న ఫోటోను రహానే తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.
లియాండర్ పేస్తో తలపడ్డ ధోనీ.. విజయం ఎవరిదంటే?!!
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ గెలిచిన ఆనందంలో ఉన్న రహానే.. తన జీవితంలోకి కూతురి రాకతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. రహానే ట్వీట్ చూసిన క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్.. రహానే దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. 'రాధిక, రహానే మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ ఆనందంతో ఏదీ సరితూగదు. ఆ ఆనందంలో మునిగితేలండి. డైపర్లు మారుస్తూ నైట్వాచ్మెన్గా కొత్త అవతారాన్ని ఎంజాయ్ చెయ్ రహానే' అని సచిన్ పేర్కొన్నాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శనివారమే రహానేకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికకు, చిన్న రాణికి కూడా కంగ్రాట్స్. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా. రహానే.. ఇప్పుడు జీవితంలో సరదా పార్ట్ మొదలైంది' అని హర్భజన్ పేర్కొన్నాడు. టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ రోహిత్శర్మ సైతం ట్విటర్ వేదికగా రహానే కుంటుంబానికి శుభాకాంక్షలు తెలిపాడు. 'నువ్వు జీవితాంతం ఆడే ఉత్తమ ఇన్నింగ్స్ ఇదే. అప్పుడప్పుడూ సమయాన్ని ఆస్వాదించు' అని ట్వీట్ చేశాడు.
రహానే తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికాను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. తొలుత స్కూల్ మేట్స్గా ఆరంభమైన వీరి ప్రయాణం.. ఆపై ఫ్రెండ్షిప్కు దారి తీసింది. అది మరింత బలపడి ప్రేమకు దారి తీసింది. ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో రహానే-రాధికలు పెళ్లి చేసుకున్నారు. 2014లో రహానే-రాధికలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా రహానే భార్య రాధికా ధోపావ్కర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.