హైదరాబాద్: శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలు గాయంతో ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గత నెలలో శ్రీలంక, జింబాబ్వేతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో షకీబ్ చేతి వేలుకు గాయమైంది. అయితే ఈ ముక్కోణపు టీ20 సిరిస్ నాటికి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ అతని గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో షకిబ్కు మరికొన్ని రోజులు విశ్రాంతినిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
చికిత్స నిమిత్తం థాయ్లాండ్కు వెళ్లగా పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో పూర్తి ఫిట్నెస్ లేని కారణంతో సిరీస్కు షకీబల్ దూరమైనట్లు జట్టు కోచ్ వాల్ష్ శనివారం మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. గాయపడ్డ షకీబ్ స్థానంలో జట్టులోకి లిటన్ దాస్ను ఎంపిక చేసి, కెప్టెన్గా మహ్మదుల్లా రియాద్ని నియమించారు.
మంగళవారం (మార్చి6) నుంచి ముక్కోణపు టీ20 సిరీస్ ఆరంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ సిరిస్ జరగనుంది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టీ20 సిరిస్ను నిర్వహిస్తున్నారు.
ముక్కోణపు టీ20 సిరిస్కు బంగ్లాదేశ్ జట్టు:
Mahmudullah Riyad (c),Tamim Iqbal, Soumya Sarkar Mushfiqur Rahim (wk), Sabbir Rahman, Mustafizur Rahman, Rubel Hossain, Abu Jayed, Taskin Ahmed, Imrul Kayes, Nurul Hasan, Mehidy Hasan, Ariful Haque, Nazmul Islam, Abu Hider Rony, Litton Kumar Das.