Cricket Australia: క్రికెట్ ఆస్ట్రేలియాలో కలకలం చోటు చేసుకుంది. బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిక్ హాక్లే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత 2024-2025 క్రికెట్ సీజన్ ముగిసిన తరువాత పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. క్రికెట్ ఆస్ట్రేలియాను వీడాలనుకోవడం టఫ్ డెసిషన్గా అభివర్ణించారు.
13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో కొనసాగుతున్నారు నిక్ హాక్లే. 2020లో సీఈఓగా అపాయింట్ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో బోర్డు కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలం అయ్యారనే కారణంతో అప్పటి సీఈఓ కెవిన్ రాబర్ట్స్ తప్పుకోవాల్సి వచ్చింది.

కెవిన్ రాబర్ట్స్ రాజీనామాతో ఈ పదవికి నిక్ హాక్లే ఏకగ్రీవంగా సెలెక్ట్ అయ్యారు. మొదట్లో మధ్యంతర సీఈఓగా కొనసాగారు. ఆ మరుసటి ఏడాది పూర్తిస్థాయి సీఈఓ హోదాను పొందారు. 2020-21 సీజన్లో క్రికెట్ ఆస్ట్రేలియాను కొత్తపుంతలు తొక్కించాడు. భారత్తో జరిగిన టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది ఆయన హయాంలోనే.
సెవెన్ వెస్ట్ మీడియా, ఫాక్స్ టెల్ గ్రూప్, డిస్నీ స్టార్లతో క్రికెట్ ఆస్ట్రేలియా దీర్ఘకాలిక మీడియా ఒప్పందాలను సాధించడంలో కృషి చేశాడు. జట్టును అభేద్యంగా తీర్చిదిద్దడంలో తనవంతు పాత్ర పోషించాడు. టీమ్ సెలెక్షన్ విషయంలో కీలకపాత్ర పోషించాడు. ఆయన పదవిని మళ్లీ పొడిగించదలచుకోలేదు బోర్డ్. దీనితో వచ్చే మార్చిలో వైదొలగబోతోన్నానని, కొత్త సీఈఓ రానున్నారని వెల్లడించారు.
కొత్త సీఈఓ ఎవరనే విషయానికి తాను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదని, ప్రస్తుతం ఈ సీజన్ను విజయవంతంగా ముగించడంపైనే దృష్టి సారించానని నిక్ చెప్పుకొచ్చాడు. ఆయన హయాంలో కొన్ని ల్యాండ్ మార్క్స్ సాధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ రెమ్యునరేషన్ ఇప్పించగలిగాడు.