ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బౌలర్ల పుణ్యమా అని రెండు విజయాలు అందుకున్నప్పటికీ.. ఆ జట్టు బ్యాటింగ్ విభాగం మాత్రం జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ వంటి విధ్వంసకర ప్లేయర్లు వరుసగా విఫలమవుతుండటం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. వీరిలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ నికోలస్ పూరన్ ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
నికోలస్ పూరన్ ఫామ్పై తీవ్ర విమర్శలు
ఈ సీజన్లో నికోలస్ పూరన్ ఆడిన 5 మ్యాచ్ల్లో కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లలో 175 నుంచి 200 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడే నికోలస్ పూరన్.. ఈ సారి మాత్రం 80 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా 7 బంతులు ఎదుర్కొన్న పూరన్.. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగుల కంటే కూడా నికోలస్ ఆటతీరు జట్టుకు నష్టం కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ్యాన్ ఫిక్సింగ్ ఆరోపణలు, ఫ్యాన్స్ ట్రోలింగ్
నికోలస్ పూరన్ పేలవ ప్రదర్శనను చూసి ఆగ్రహించిన లక్నో అభిమానులు వింత వింత ఆరోపణలు చేస్తున్నారు. నికోలస్ పూరన్ కావాలనే సరిగ్గా ఆడటం లేదని, జట్టును "స్కామ్" చేస్తున్నాడని ఎక్స్లో (ట్విట్టర్) ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా అతనిపై అవినీతి నిరోధక విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి నికోలస్ పూరన్ ఫామ్ తగ్గుతూ వస్తోందని.. ఈ సీజన్లో అతను పూర్తిగా తేలిపోయాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్థానం మార్పు వల్లే నిరాశగా ఉన్నాడా?
నికోలస్ పూరన్ వైఫల్యానికి కారణం బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులేనని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. గత సీజన్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి అదరగొట్టిన పూరన్ను పక్కన పెట్టి.. ఈసారి రిషబ్ పంత్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం నికోలస్ పూరన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. తన అభిమాన స్థానాన్ని పంత్ తీసుకోవడం వల్లే పూరన్ నిరుత్సాహపడి.. జట్టుకు సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం అనేది పెద్ద మార్పు కాదని, ప్రొఫెషనల్ క్రికెటర్లు ఇలాంటి కారణాలతో వెనకడుగు వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.