హైదరాబాద్: బీసీసీఐపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ నిర్వహణపై దాఖలైన ఓ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఆదివారం ఢిల్లీ టెస్టులో ఏం జరిగింది: లంక ఆటగాళ్లు కావాలనే మాస్క్లు ధరించారా?
ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ స్వాతన్టర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ గాలి కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నగరంలో మ్యాచ్ నిర్వహణ ఏంటని బీసీసీఐని ఎన్జీటీ ప్రశ్నించింది. 'ప్రస్తుతం వాయు కాలుష్యం తక్కువ నాణ్యత నుంచి అధ్వాన పరిస్థితులకు మారిపోతోంది. చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసు. కాలుష్య తీవ్రత పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు నుంచి ప్రమాదకర స్థాయికి చేరింది. దీని తర్వాతి స్థాయి ఇక ఎమర్జెన్సీ లెవల్. రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ, దిల్లీ ప్రభుత్వం, కార్పొరేషన్లు గత నాలుగు రోజులుగా ఏం చేస్తున్నాయో చెప్పాలి. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలి' అంటూ అని ట్రైబ్యునల్ హెచ్చరించింది.
ఇదే సమయంలో కోట్లా మైదానంలో మ్యాచ్ను కొనసాగిస్తున్న నిర్వహకులపై కూడా ట్రైబ్యునల్ మండిపడింది. కాలుష్యం ప్రమాద స్థాయికి చేరినా మ్యాచ్ను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. ఢిల్లీ టెస్టులో రెండోరోజైన ఆదివారం గాలి కాలుష్యం కారణంగా ఆడలేకపోతున్నామంటూ శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు మైదానంలోనే హైడ్రామా చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
దీంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు ధరించి ఆడారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ 240 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం 12.32 ప్రాంతంలో లంక పేస్ బౌలర్ గమాగె దగ్గుతో.. బౌలింగ్ ఆపేశాడు. ఆ సమయంలో అశ్విన్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. మిగతా ఆటగాళ్లు కూడా అసౌకర్యంగా కనిపించడంతో ఆట నిలిచిపోయింది.
గాలిలో తగినంత నాణ్యత కరవైందని శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించారు. ఆటను నిలిపివేయాలని కోరారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆట ఆపడం సాధ్యం కాదని లంక జట్టుకు అంపైర్లు తేల్చి చెప్పారు. ఆ తర్వాత చివరికి 17 నిమిషాల తర్వాత మళ్లీ ఆట మొదలైంది. లంక జట్టు మాత్రం ఆట కొనసాగించడానికి అయిష్టంగానే కనిపించింది.
ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్లు ధరించి ఫీల్డింగ్కు దిగారు. 25 నిమిషాల తర్వాత మళ్లీ ఆ జట్టు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేసింది. దీంతో రెండోసారి ఆట ప్రారంభమైన తర్వాత కూడా లంక ఆటగాళ్లు మళ్లీ ఆటకు అడ్డుపడ్డారు. దీంతో ఏకాగత్ర కోల్పోయిన విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. మళ్లీ అలాగే చేస్తుండటంతో కోహ్లీ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.