ఈ సిరీస్ కీలకం..
భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ ముందు తాము ఇక్కడ ఆడే చివరి సిరీస్ ఇదేనని, కాబట్టి ఈ సిరీస్ తమకు చాలా ముఖ్యమని లాథమ్ చెప్పాడు. 'వన్డే వరల్డ్ కప్ ముందు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి మాకు ఉన్న చివని ఛాన్స్ ఇది. ఈ పరిస్థితుల గురించి ఎంత నేర్చుకోవాలో అంతా ఈ సిరీస్లోనే నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు భారత్లో ఆడిన అనుభవం ఉన్న వాళ్లే కావడం మా అదృష్టం' అని లాథమ్ చెప్పాడు. ఇక్కడి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయని, వాటికి అలవాటు పడటం తమకు చాలా అవసరమని అన్నాడు.
ఐపీఎల్ ఆటగాళ్లతో చర్చలు..
తమ దేశంలో లేదా భారత్లో ఎక్కడైనా టీమిండియాతో తాము ఎక్కువగా ఆడుతుంటామని చెప్పిన లాథమ్.. ఇది తమకు నిజంగా అదృష్టమే అన్నాడు. 'మా జట్టులో ఉన్న వారిలో ఇక్కడ ఆడిన వాళ్లతో చాలా విషయాలు చర్చిస్తున్నాం. ఐపీఎల్ ఆడిన వాళ్లు కూడా మా జట్టులో ఉన్నారు. వాళ్లతో కూడా ఇక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. రకరకాలుగా ఉండే డెలివరీలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. భారత్లో ఆడుతుంటే ఇక్కడ స్పిన్ ఎంత ముఖ్యమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు' అని వివరించాడు.
కోహ్లీ కోసం ప్రత్యేక ప్లాన్
ఇక ప్రస్తుతం అరి వీర భయంకరమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై తాము ప్రత్యేకమైన ఫోకస్ పెట్టామని లాథమ్ చెప్పాడు. 'విరాట్ చాలా గొప్ప క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ బంతిని అద్భుతంగా టైమ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అతని కోసం మేం చాలా కష్టపడి, సాధ్యమైనంత మంచి ప్లాన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మేం జట్టు కోసం ఎంపిక చేసే సమయంలో స్కౌటింగ్ చేసినట్లే.. కోహ్లీ కోసం కష్టపడక తప్పదు. అతనికి పరుగులు చేసే అవకాశం అంత సులభంగా ఇవ్వకూడదనేదే మా ప్లాన్' అని స్పష్టం చేశాడు. కివీస్పై విరాట్కు అద్భుతమైన రికార్డు ఉంది. మరి ఈ సిరీస్లో అతను ఎలా రాణిస్తాడో చూడాలి.